న్యూఢిల్లీ: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా ఓటమికి రోహిత్ శర్మ ఒక్కడినే బాధ్యుడిని చేస్తూ విమర్శలు గుప్పించడం సరికాదని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. క్రికెట్ అనేది టీమ్ గేమ్ అని, ఒక్కడి ప్రదర్శనతో ఫలితం రాదని తెలిపాడు. ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమిపాలైన విషయం తెలిసిందే.
రోహిత్ శర్మ కెప్టెన్సీ వైఫల్యంతోనే టీమిండియా ఓటమిపాలైందని భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్తోపాటు ఇతర మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన హర్భజన్ సింగ్.. వాటిని తప్పుబట్టాడు. మరో మూడు నెలల్లో వన్డే ప్రపంచకప్ ఉన్నందున బీసీసీఐ రోహిత్కు అన్ని రకాలుగా మద్దతుగా నిలవాల్సిన అవసరముందని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు.

అప్పుడే కెప్టెన్గా అతను సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోగలడని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. భారత జట్టుతోపాటు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ టీమ్లోని ప్రతి ఒక్కరూ రోహిత్ శర్మను ఎంతో గౌరవిస్తారని హర్భజన్ సింగ్ గుర్తు చేశాడు.
'రోహిత్ శర్మ కెప్టెన్సీపై వస్తున్న విమర్శలు చూస్తున్నా. ఈ విషయంలో కొంతమంది కాస్త అతిగా మాట్లాడుతున్నారు. క్రికెట్ అనేది ఒక జట్టు ఆట. ఒక్క ఆటగాడి ప్రదర్శనతో ఫలితాలు రావు. ఏ ఒక్క ఆటగాడో జట్టును ఉన్నతస్థాయిలో నిలబెట్టలేడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా బాగా రాణించలేదు. ఆ ప్రదర్శన గురించి మాట్లాడి ముందుకు సాగాలి. అంతే కానీ, ఒక్క రోహిత్నే విమర్శించడం అన్యాయం.
అతను అసాధారణమై కెప్టెన్. ఇటీవల వచ్చిన ఫలితాల ఆధారంగా అతని కెప్టెన్సీపై ఓ అంచనాకు రావడం అన్యాయం. రోహిత్ మళ్లీ రాణిస్తాడు. అతనిపై విశ్వాసం ఉంచి మద్దతుగా నిలవాలి. బీసీసీఐ నుంచి మద్దతు ఉంటే స్వేచ్ఛగా పని చేసుకోవచ్చు. ధోనీ, విరాట్ కోహ్లీలతోపాటు చాలామంది కెప్టెన్లకు బీసీసీఐ నుంచి మద్దతు లభించింది.
రోహిత్కు బీసీసీఐ నుంచి మద్దతు లభిస్తోంది. కానీ, అది ఏ స్థాయిలో ఉందో నాకు తెలియదు. ఆ రకమైన మద్దతు ఉంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాడు. ఆ మద్దతు ఉంటే అతనికి స్వేచ్ఛ లభిస్తోంది. బీసీసీఐ తన కెప్టెన్లందరికీ ఏ విధంగానైతే మద్దతుగా నిలిచిందో రోహిత్ శర్మకు కూడా అదే విధంగా అండగా నిలవాలి.'అని హర్భజన్ సింగ్ బీసీసీఐకి రిక్వెస్ట్ చేశాడు.