Harbhajan Singh: సౌతాఫ్రికా పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్లలో స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ను వన్డేలకు మాత్రమే పరిమితం చేయడంపై వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ 2024 జరగనున్న నేపథ్యంలో పొట్టి ఫార్మాట్ ఆడించకుండా వన్డేలకు ఎంపికచేయడాన్ని తప్పుబట్టాడు. చాహల్ విషయంలో సెలెక్టర్ల తీరు లాలీపాప్ ఇచ్చి నాక్కోఅన్నట్లుగా ఉందని ఘాటుగా విమర్శించాడు.
డిసెంబర్ 10 నుంచి ప్రారంభమయ్యే ఈ సౌతాఫ్రికా పర్యటన కోసం అజిత్ అగార్కర్ సారథ్యంలో భారత సెలెక్షన్ కమిటీ మూడు వేర్వేరు జట్లను ఎంపిక చేసింది. ఈ పర్యటనలోని పరిమిత ఓవర్ల సిరీస్లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దూరంగా ఉన్నారు. కేవలం టెస్ట్ సిరీస్ మాత్రమే ఆడనున్నారు. దాంతో టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్, వన్డే కెప్టెన్గా కేఎల్ రాహుల్ను ఎంపిక చేశారు. టీ20లకు చాహల్ను పూర్తిగా పక్కనపెట్టిన టీమ్మేనేజ్మెంట్.. ఊరటగా వన్డేల్లో అవకాశం కల్పించారు.

ఈ ఎంపికపై హర్భజన్ సింగ్ ఘాటుగా స్పందించాడు. 'టీ20ల్లో యుజ్వేంద్ర చాహల్కు అవకాశం ఇవ్వలేదు. కానీ వన్డేలకు మాత్రం ఎంపిక చేశారు. ఇదెలా ఉందంటే ఓ లాలీపాప్ను చాహల్ చేతికి ఇచ్చి నాక్కో అన్నట్లుగా ఉంది. నువ్వెంత రాణించినా టీ20 ఫార్మాట్లోకి తీసుకోమని చెప్పినట్లు ఉంది. బాధపడకుండా వన్డేలకు ఎంపిక చేసినట్లు ఉంది.
టెస్ట్ టీమ్లో పుజారా, రహానేలను కూడా పక్కనపెట్టారు. సౌతాఫ్రికా పర్యటనలో రాణించడం ఆశామాషి వ్యవహారం కాదు. యువకులకు ఛాన్స్ ఇవ్వడం మంచిదే అయినా వాళ్లు అక్కడి పరిస్థితులను తట్టుకోలరా అనేదే ప్రశ్న.'అని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు.
డిసెంబర్ 10న ప్రారంభమయ్యే ఈ పర్యటలో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్లు ఆడనుంది. ఈ మూడు ఫార్మాట్లలో ఎంపికైన ఆటగాళ్లు ముగ్గురు మాత్రమే కావడం విశేషం. ముఖేష్ కుమార్, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్లకు మాత్రమే మూడు ఫార్మాట్లలో చోటు దక్కింది.