Harbhajan Singh:ఈ సారి సౌతాఫ్రికాకు దబిడి దిబిడే.. టీమిండియాకు ఇదే గోల్డెన్ చాన్స్!

న్యూఢిల్లీ: టీమిండియా సౌతాఫ్రికా పర్యటన నేపథ్యంలో వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచేందుకు కోహ్లీసేనకు ఇదే గోల్డెన్ చాన్స్ అని తెలిపాడు. ప్రస్తుత సౌతాఫ్రికా జట్టు గతంలో కంటే చాలా బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డాడు. ఏ విధంగా చూసుకున్న కోహ్లీసేననే బలంగా కనిపిస్తుందన్న హర్భజన్.. ఈసారి భారత్ సిరీస్ కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు. ఈ నెల 26 నుంచి మొదలయ్యే ఈ పర్యటనలో సౌతాఫ్రికాతో భారత్ 3 టెస్ట్లు, 3 వన్డేలు ఆడనుంది. నాలుగు టీ20ల సిరీస్ను కూడా షెడ్యూల్ చేసినప్పటికీ కరోనా ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో టీ20 సిరీస్ను వాయిదా వేసారు.

గోల్డెన్ చాన్స్...
ఇక ఈ పర్యటనను ఉద్దేశించి హర్భజన్ సింగ్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడాడు. గత పర్యటనలోని సౌతాఫ్రికా జట్లతో పోల్చితే ప్రస్తుత జట్టు చాలా బలహీనంగా ఉందని భజ్జీ చెప్పుకొచ్చాడు. 'సౌతాఫ్రికాలో తొలి సిరీస్ గెలిచేందుకు టీమిండియాకు ఇదే బంగారంలాంటి అవకాశం. ఆ జట్టు ఈసారి చాలా బలహీనంగా ఉంది. కనీసం గత పర్యటనలోనైనా ఏబీ డివిలియర్స్, ఫాఫ్ డుప్లెసిస్ వంటి ఆటగాళ్లు భారత విజయాన్ని అడ్డుకున్నారు. కానీ ఈసారి వాళ్లు కూడా లేరు. ఇన్నాళ్లు భారత్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేసినా సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్ సాధించలేకపోయింది. కానీ ఈ సారి ఆ నిరీక్షణకు తెరపడుతోంది. ఎందుకంటే సఫారీ బ్యాటింగ్ అంత గొప్పగా ఏం లేదు.'అని భజ్జీ అభిప్రాయపడ్డాడు.

7 సిరీస్లు ఆడినా..
ఇక ఇప్పటి వరకు సఫారీ గడ్డపై 7 సిరీస్లు ఆడిన భారత జట్టు ఒక్క సిరీస్ కూడా గెలవలేకపోయింది. ధోనీ సారథ్యంలోని 2010 పర్యటనలో మూడు టెస్ట్ల సిరీస్ను 1-1తో డ్రా చేసుకుంది. సఫారీ గడ్డపై మొత్తం 20 మ్యాచ్లు ఆడగా.. మూడింటిలో మాత్రమే గెలిచింది. 10 మ్యాచ్ల్లో ఓడి ఏడింటిని డ్రా చేసుకుంది. 2018 పర్యటనలో 2-1 తేడాతో సిరీస్ ఓడిపోయింది. ఈ సారైనా గెలిచి చరిత్ర సృష్టించాలని భావిస్తోంది.

యువ ఆటగాళ్లతో సఫారీ టీమ్.
కరోనా ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో ఈ మూడు టెస్ట్ల సిరీస్ కోసం ఇరు జట్లు జంబో టీమ్ను ప్రకటించాయి. 21 మంది సభ్యులతో కూడిన జట్టును సౌతాఫ్రికా ఎంపిక చేస్తే.. భారత్ 18 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. ఇక కెప్టెన్ డీన్ ఎల్గర్(69 మ్యాచ్లు), వికెట్ కీపర్ బ్యాట్స్మన్ క్వింటన్ డికాక్(53 మ్యాచ్లు), ఎయిడెన్ మార్క్రమ్(26 మ్యాచ్లు), టెంబా బవుమా(44 మ్యాచ్లు ) మినహా అంతా అనుభవం లేని ఆటగాళ్లే ఉన్నారు. మరోవైపు భారత్ మాత్రం స్టార్ ఆటగాళ్లంతో బలంగా కనిపిస్తోంది. కివీస్తో టెస్ట్ సిరీస్కు దూరంగా ఉన్న రోహిత్ శర్మ, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ ఈ సిరీస్తో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications