టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో తనకు గత 10 ఏళ్లుగా మాటలు లేవని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. తమ మధ్య ఎలాంటి స్నేహం లేదని, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడినప్పుడు కూడా ఎక్కువగా మాట్లాడుకోలేదని చెప్పాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ధోనీ గురించి భజ్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'ధోనీతో నాకు మాటాల్లేవ్. మేం మాట్లాడుకోక 10 ఏళ్లు అవుతోంది. ధోనీతో నాకు ఎలాంటి సమస్య లేదు. అతనే నాతో మాట్లాడటం లేదు. నాతో మాట్లాడకపోవడానికి గల కారణం ఏంటో కూడా నాకు తెలియదు. సీఎస్కే తరఫున ఆడుతున్నప్పుడు మేం మాట్లాడుకున్నాం. కానీ మా మాటలు మైదానం వరకే పరిమితమయ్యేవి.

అతను నా రూమ్లోకి రాలేదు. నేను కూడా అతని గదిలోకి వెళ్లలేదు. ధోనీతో నాకేం గొడవ లేదు. అతను ఏదైనా చెప్పాలనుకుంటే నాకు చెప్పగలడు. కానీ, ఏదైనా ఉంటే ఈ పాటికే చెప్పి ఉండేవాడు. నేనెప్పుడూ ధోనీకి ఫోన్ చేయను. నన్ను పట్టించుకోని వారితో ఎక్కువగా ఉండను. రిలేషన్ అనేది ఎల్లప్పుడూ ఇచ్చిపుచ్చుకోవడంపై ఆధారపడి ఉంటుంది.
మనం ఎదుటివారిని గౌరవిస్తే వారి నుంచి కూడా అదే ఆశిస్తాం. కానీ, ఎవరికైనా ఒకట్రెండుసార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోతే వారిని అవసరమైనప్పుడు మాత్రమే కలుస్తాను.'అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు. ధోనీ సారథ్యంలో హర్భజన్ సింగ్ సుదీర్ఘ కాలం ఆడాడు. ధోనీ సారథ్యంలో భారత్ గెలిచిన 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ జట్లలోనూ హర్భజన్ సింగ్ కీలక సభ్యుడిగా ఉన్నాడు.
ధోనీ కెప్టెన్సీ చేసే సమయంలోనే భజ్జీతో అతనికి విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరూ కలిసి 2015లో సౌతాఫ్రికాతో జరిగిన చివరి వన్డేలో ఆడారు. ఈ మ్యాచ్లో హర్భజన్ సింగ్ 10 ఓవర్లు బౌలింగ్ చేసి 70 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.