రాహుల్ ద్రవిడ్ కోచ్ ఉన్నప్పుడే టీమిండియా మెరుగైన ప్రదర్శన చేసిందని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియా ప్రదర్శన ఆందోళనకరంగా మారిందని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆసీస్ 3-1తో గెలచుకుంది. ఈ గెలుపుతో డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ బెర్త్ను కూడా దక్కించుకుంది.
మరోవైపు భారత్ ఘోర పరాజయంతో డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను గల్లంతు చేసుకుంది. టీమిండియా ప్రదర్శనపై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన హర్భజన్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పేరు ప్రస్తావించకుండా విమర్శలు గుప్పించిన హర్భజన్ సింగ్.. సీనియర్ బ్యాటర్లు అయిన రోహిత్ శర్మ, కోహ్లీలకు కూడా చురకలంటించాడు.

'రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్గా ఉన్నప్పుడే టీమిండియా మెరుగ్గా ఆడింది. సొంతగడ్డపై ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్ గెలిచాం. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్ 2024 సాధించాం. కానీ ఆ తర్వాత ఆకస్మాత్తుగా భారత జట్టుకు ఏమైందో నాకు అర్థం కావడం లేదు. గత ఆరు నెలల్లో శ్రీలంక చేతిలో వన్డే సిరీస్ కోల్పోయాం. న్యూజిలాండ్తో సొంతగడ్డపై వైట్వాష్కు గురయ్యాం. తాజాగా ఆస్ట్రేలియా చేతిలో 3-1తో సిరీస్ కోల్పోయాం. ఒక్కసారిగా పతనమైనట్లు అనిపిస్తోంది.
కోహ్లీ, రోహిత్ ఎవరైనా ఆట కంటే ఎవరూ ముఖ్యం కాదు. కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే వంటి మ్యాచ్ విన్నర్లు సైతం జట్టులో చోటు కోల్పోయారు. టీమిండియా సూపర్ స్టార్ సంస్కృతిని వదిలి పెట్టాలి. అభిమన్యు ఈశ్వరన్, సర్ఫరాజ్ ఖాన్లకు ఒక్క అవకాశం ఇవ్వలేదు. పేరున్న ఆటగాళ్లను కాకుండా బాగా ఆడే ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి.
జస్ప్రీత్ బుమ్రా లేకుంటే ఈ సిరీస్లో టీమిండియా 0-5తో క్లీన్ స్వీప్ అయ్యేది. అతను అసాధారణ బౌలింగ్తో తొలి టెస్ట్లో విజయాన్నందించాడు. మిగతా మ్యాచ్ల్లో అద్భుత బౌలింగ్తో జట్టుకు విజయవకాశాలను అందించాడు.'అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.