న్యూఢిల్లీ: వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేసిన టీమిండియా టెస్ట్ టీమ్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా చతేశ్వర్ పుజారాను జట్టు నుంచి తప్పించడాన్ని మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు తప్పుబడుతున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో బ్యాటింగ్ విభాగం మొత్తం విఫలమైనా.. పుజారా ఒక్కడినే బలి పశువును చేశారని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఘాటుగా విమర్శించాడు.
ఇక టీమిండియా బ్యాక్బోన్ను తప్పించడం ఏంటని హర్భజన్ సింగ్ ఫైర్ అయ్యాడు. అతనికి విశ్రాంతి ఇచ్చారనే తాను భావిస్తున్నానని హర్భజన్ సింగ్ తెలిపాడు. 'వెస్టిండీస్ పర్యటనకు ప్రకటించిన జట్టులో చతేశ్వర్ పూజారాకు చోటు దక్కకపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. టీమిండియాకు అతను కీలక ఆటగాడు. జట్టు బ్యాటింగ్కు పూజారా వెన్నెముక లాంటోడు.

చతేశ్వర్ పూజారాని తప్పిస్తే ఆ ప్రభావం జట్టు మొత్తంపై తీవ్రంగా పడుతోంది. వెన్నెముక లేకుండా మిగిలిన ఎముకల గూడు ఎలా నిలబడుతుంది. అయినా మిగిలిన బ్యాటర్ల యావరేజ్ కూడా గొప్పగా ఏం లేదు. టీమ్లో అందరికీ సమ న్యాయం దక్కాలి. బెంచ్ మార్కు దాటకపోతే ఎంత పెద్ద ప్లేయర్ని అయినా తప్పించాల్సిందే.
అది కెప్టెన్ రోహిత్ శర్మ అయినా, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అయినా... అప్పుడే మిగిలిన ఆటగాళ్లకు బాగా ఆడాలనే బాధ్యత, భయం పెరుగుతాయి. చతేశ్వర్ పూజారాకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చి ఉంటారు. కానీ పూర్తిగా తప్పించి ఉండరనే అనుకుంటున్నా.'అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.

జూలై 12 నుంచి ప్రారంభం కానున్న ఈ పర్యటనలో టీమిండియా.. ఆతిథ్య వెస్టిండీస్తో రెండు టెస్ట్లు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. 16 మంది సభ్యులతో కూడిన టెస్ట్ టీమ్ వివరాలను ఎస్ఎస్ దాస్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల సెలెక్షన్ కమిటీ శుక్రవారం వెల్లడించింది. డబ్ల్యూటీసీ ఫైనల్లో విఫలమైన చతేశ్వర్ పుజారాతో పాటు ఉమేశ్ యాదవ్లపై వేటు వేసిన సెలెక్టర్లు.. దేశవాళీ క్రికెట్తో పాటు ఐపీఎల్లో సత్తా చాటిన రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైస్వాల్లకు అవకాశం ఇచ్చారు.