
కోహ్లీ జట్టును నడిపించగలడు..
మ్యాచ్ అనంతరం ఇండియా టూడేతో మాట్లాడుతూ... కోహ్లీకి సారథ్యం వహించడం భారం కాదని, కెప్టెన్గా అతడెలాంటి ఒత్తిడికి గురవడం లేదని పేర్కొన్నాడు. కోహ్లీ నాయకుడని, ముందుండి జట్టును నడిపిస్తాడని, ఇతరులకు ప్రేరణగా నిలుస్తాడని చెప్పాడు. ‘కెప్టెన్సీతో కోహ్లీ ఒత్తిడికి లోనవుతున్నాడని నేను అనుకోవడం లేదు. సారథ్యం అతనికి ఏ మాత్రం భారం కాదు. అతనో లీడర్. జట్టును ముందుండి నడిపిస్తూ ఇతరులకు స్పూర్తిగా నిలుస్తాడు. జట్టు కోసం విజయాలందిస్తాడు.'అని భజ్జీ చెప్పుకొచ్చాడు.

ఒక్కడు ఏం చేయలేడు..
కెప్టెన్సీ వల్ల కోహ్లీ ఆట దెబ్బతింటుందనే వాదనలో నిజం లేదన్నాడు. ‘కెప్టెన్సీ కోహ్లీ ఆటపై ఏ మాత్రం ప్రభావం చూపడం లేదు. కోహ్లీ ఒక్కడే మ్యాచ్ గెలిపించలేడు. గతేడాది వన్డే ప్రపంచకప్ తర్వాత కూడా నేను ఇదే విషయం చెప్పాను. రోహిత్, విరాట్ ఇద్దరే ఎక్కువ పరుగులు చేస్తున్నారు. రాహుల్ బాగా ఆడుతున్నా మిగిలిన ఆటగాళ్లు కూడా నిలకడగా పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. అలా జరిగితే కెప్టెన్ మీద భారం తగ్గుతుంది. దాంతో అతను స్వేచ్ఛగా ఆడగలుగుతాడు.'అని భజ్జీ పేర్కొన్నాడు.

స్పిన్తో స్మిత్ను కట్టడి చేయాలి..
ఇక రెండు వన్డేల్లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో భారత బౌలర్లకు నిద్ర లేకుండా చేసిన స్మిత్ను స్పిన్తో కట్టడి చేయాలని హర్భజన్ సింగ్ సూచించాడు. స్మిత్ ఎప్పుడూ పేస్ను ఆడటానికి ఇష్టపడుతాడని తెలిపాడు. ఒకసారి స్పిన్ బౌలింగ్లో అతని బ్యాటింగ్ పరీక్షించాలన్నాడు. అతను క్రీజులోకి వచ్చినప్పుడు ఇద్దరు స్పిన్నర్లతో బౌలింగ్ చేయించాలన్నాడు. 7-8 ఓవర్లు బౌలింగ్ చేసి చూడాలన్నాడు.

చహల్కు సలహా..
చహల్ బౌలింగ్ విషయంలో ఎలాంటి తప్పులేదన్నాడు. ఐపీఎల్లో అతను చెలరేగడానికి పిచ్లే కారణమని, యూఏఈతో పోలిస్తే ఆస్ట్రేలియాలో అవి పూర్తి భిన్నంగా ఉంటాయన్నాడు. అందువల్లే చాహల్ వికెట్లు తీయలేకపోతున్నాడని పేర్కొన్నాడు. కోహ్లీ చెప్పినట్లు కంగారూ ఆటగాళ్లకు తమ మైదానాలపై పూర్తి అవగాహన ఉందని, ఆ పరిస్థితులను వారు సద్వినియోగం చేసుకుంటున్నారని వివరించాడు. చాహల్ రాణించాలంటే బంతిని కాస్త నెమ్మదిగా వదలాలని, దాంతో అది కొంచెం టర్న్ తీసుకుంటుందని సూచన చేశాడు.


Click it and Unblock the Notifications
