న్యూఢిల్లీ: మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో వన్డే ప్రపంచకప్ 2011 గెలిచిన భారత జట్టు.. మళ్లీ ఒక్క మ్యాచ్ ఆడలేదు. శ్రీలంకతో జరిగిన నాటి ఫైనల్లో ధోనీ సిక్స్తో 36 ఏళ్ల కళను సాకారం చేసుకుంటూ రెండోసారి టీమిండియా ప్రపంచకప్ ముద్దాడింది. ఆ మ్యాచ్ ఆడిన భారత తుది జట్టు.. అనంతరం ఒక్క మ్యాచ్ ఆడలేదు.
కొందరు గాయాలతో జట్టుకు దూరమైతే మరికొందరు పేలవ ఫామ్తో జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యారు. ఇదే విషయాన్ని నాటి స్పిన్నర్ హర్భజన్ సింగ్ ముందు ఉంచగా.. అతను కూడా ఆ మిస్టరీ ఏంటో తనకు తెలియదన్నాడు. ప్రపంచకప్ గెలిచిన జట్టు కనీసం ఒక్క మ్యాచ్ ఆడినా బాగుండేదని అభిప్రాయపడ్డాడు.

'వన్డే ప్రపంచకప్ జట్టు మళ్లీ ఎందుకు ఆడలేదో నాకు కూడా తెలియదు. బహుషా ఆ ప్రపంచకప్ వరకే వారిని కొనసాగించాలని టీమ్మేనేజ్మెంట్ భావించినట్లుంది. మ్యాచ్ విషయం పక్కనపెడితే వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ ఒక్కసారి కూడా కలవలేదు. ఇది నాకు ఇప్పటికీ మిస్టరినే. అందరం కలిసి ఒక మ్యాచ్ ఆడినా బాగుండేది. ఇది జరగాలని ఆశిస్తున్నా.
అందరితో ఒక మ్యాచ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. చాలా సరదాగా కూడా ఉంటుంది. దురదృష్టవశాత్తు అలాంటి ప్రయత్నం జరగలేదు. జట్టు కలవలేదు. 2011 వన్డే ప్రపంచకప్ గెలిచే వరకు జట్టు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత మార్పులు చోటు చేసుకున్నాయి. ఎవరైతే భారత విజయంలో కీలక పాత్ర పోషించారో వారికే అవకాశం లేకుండా పోయింది.
కొందరికి అదే చివరి ప్రపంచకప్ అయినా.. మరికొందరిని కొనసాగించాల్సింది.'అని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించిన గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్లను జట్టులో కొనసాగించాల్సిందని హర్భజన్ సింగ్ అన్నాడు. ఈ ఇద్దరికి అన్యాయం జరిగిందని పరోక్ష వ్యాఖ్యలు చేశాడు.