టీమిండియా స్టార్ పేసర్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీలను ఎందుకు జట్టులోకి తీసుకోవడం లేదని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రశ్నించాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ప్రత్యామ్నాయ బౌలర్లను కనుగొనాలని సూచించాడు. సౌతాఫ్రికాతో రెండో వన్డేలో టీమిండియా ఓటమికి బౌలింగ్ వైఫల్యమే ప్రధాన కారణమని చెప్పాడు. బుమ్రా లేకుంటే భారత బౌలింగ్ బలహీనంగా కనిపిస్తుందని అభిప్రాయపడ్డాడు.
బుధవారం రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో సమష్టిగా విఫలమైన భారత్ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 358 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఈ పరాజయంపై మాట్లాడిన హర్భజన్ సింగ్.. బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేయడంపై దృష్టిసారించాలని టీమిండియా మేనేజ్మెంట్కు సూచించాడు.

'ఇంగ్లండ్ పర్యటనలో జస్ప్రీత్ బుమ్రా లేకపోయినా మహమ్మద్ సిరాజ్ అద్భుతంగా రాణించాడు. బుమ్రా ఆడని మ్యాచ్లను కూడా భారత్ గెలిచింది. కానీ వన్డేలు, టీ20ల్లో మాత్రం ఫలితం భిన్నంగా ఉంటుంది. ఈ ఫార్మాట్లలో కూడా బుమ్రాకు ప్రత్యామ్నాయ బౌలర్లను కనుగొనాలి. అది స్పిన్నర్ అయినా పేసర్ అయినా వికెట్లు తీయగల బౌలర్ను గుర్తించాలి. ఇప్పటికే జట్టులో కుల్దీప్ యాదవ్ స్పిన్నర్గా ఉన్నాడు. అతనికి తోడుగా వరుణ్ చక్రవర్తీని కూడా జట్టులోకి తీసుకురావాలి. అతను ఇప్పటికే టీ20ల్లో మెరుగైన ప్రదర్శన చేశాడు. కాబట్టి వన్డేల్లో కూడా అవకాశం ఇవ్వాలి.
మహమ్మద్ షమీని ఎందుకు పక్కనపెట్టారో నాకు అర్థం కావడం లేదు. ప్రసిధ్ కృష్ణ జట్టులో ఉన్నాడు. అతను మెరుగైన బౌలర్. కానీ అతను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎంతో మంది మంచి బౌలర్లు ఉన్నారు. బుమ్రా లేకుంటే టీమిండియా బౌలింగ్ బలహీనంగా కనిపిస్తోంది. జస్ప్రీత్ బుమ్రా లేకున్నా మ్యాచ్లను గెలిపించగల బౌలర్లను జట్టులోకి తీసుకురావాలి. వర్క్లోడ్లో భాగంగా బుమ్రా వన్డేలు ఆడటం లేదు. మరోవైపు మహమ్మద్ షమీకి అవకాశాలు ఇవ్వడం లేదు.
అతను ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్ తరఫున ఆడుతున్నాడు. భారత్ 358 పరుగులు చేసినా ఓడిపోవడం తీవ్రంగా నిరాశపరిచింది. వికెట్లు తీయడానికి భారత్ ఒక మార్గాన్ని కనుగొనాలి. సొంతగడ్డపై టెస్ట్, వన్డే సిరీస్లు చేజార్చుకోకూడదు. ఈ వన్డే సిరీస్ కూడా ఓడిపోతే అభిమానుల్లో విశ్వాసం సన్నగిల్లుతోంది. ఎట్టి పరిస్థితుల్లో మూడో వన్డేలో భారత్ విజయం సాధించాలి.'అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు. ఆఖరి వన్డే డిసెంబర్ 6న వైజాగ్ వేదికగా జరగనుంది.