ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దుమ్మురేపుతాడని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ జోస్యం చెప్పాడు. కోహ్లీతో పాటు రోహిత్ శర్మ ఆటను చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడని తెలిపాడు. ఫిట్నెస్ విషయంలో విరాట్ కోహ్లీకి తిరుగులేదని చెప్పాడు. సొంతగడ్డపై వెస్టిండీస్తో రెండు టెస్ట్ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది.
ఈ పర్యటనతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మైదానంలోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఐపీఎల్ తర్వాత ఈ ఇద్దరూ ఆటగాళ్లు మైదానంలోకి బరిలోకి దిగుతున్నారు. వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా ఈ ఇద్దరూ ఆటగాళ్లు సన్నదమవుతున్నారు. దాంతో ఈ సిరీస్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ పర్యటన కోసం భారత జట్టు బుధవారం ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కనుంది.

తాజాగా ఈ సిరీస్ గురించి మాట్లాడిన హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'విరాట్ కోహ్లీ ఫామ్ గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ఆట విషయంలో అతను ఎంతో పర్ఫెక్ట్. జట్టులో అతనే అత్యంత ఫిట్టెస్ట్ క్రికెటర్. ప్రస్తుతం అతనితో కలిసి ఆడుతున్న వారిలో చాలా మంది కంటే కూడా కోహ్లీ ఫిట్గా ఉన్నాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ ఫిట్టెస్ట్ ప్లేయర్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు.
అతని ఆట కోసం ఎదురుచూస్తున్నా. విరాట్ కోహ్లీ మరింత కాలం వన్డేల్లో కొనసాగాలని కోరుకుంటున్నా. ఆస్ట్రేలియా కోహ్లీకి ఇష్టమైన ప్రదేశం. అక్కడ టన్నుల కొద్దీ పరుగులు రాబట్టాడు. మరోసారి రాణిస్తాడని నమ్మకంగా ఉన్నా. మూడు మ్యాచ్ల్లో కనీసం రెండు సెంచరీలు చేస్తాడని ఆశిస్తున్నా. రోహిత్ కూడా మంచి ప్రదర్శన చేసి జట్టు విజయానికి తోడ్పడాలని కోరుకుంటున్నా.'అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.
శుభ్మన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(కీపర్), ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ.
తొలి వన్డే: అక్టోబర్ 19(ఆదివారం),పెర్త్, ఉదయం 9 గంటలకు
రెండో వన్డే: అక్టోబర్ 23(గురువారం), అడిలైడ్, ఉదయం 9 గంటలకు
మూడో వన్డే: అక్టోబర్ 25(శనివారం), సిడ్నీ , ఉదయం 9 గంటలకు