టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్పిన్ బౌలింగ్లో తడబడటానికి గల కారణాన్ని దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తెలిపాడు. స్వేచ్చగా బ్యాటింగ్ చేయలేకపోవడం వల్లే స్పిన్ బౌలింగ్లో కోహ్లీ విఫలమవుతున్నాడని అభిప్రాయపడ్డాడు. అతను ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా స్వేచ్చగా స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోవాలని సూచించాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(38 బంతుల్లో 22) లెఫ్టార్మ్ స్పిన్నర్ రిషద్ హొస్సేన్ బౌలింగ్లో ఔటయ్యాడు.
అతని బౌలింగ్లో తీవ్రంగా తడబడిన కోహ్లీ.. 10 డాట్ బాల్స్ ఆడాడు. చివరకు ఒత్తిడిలో నిర్లక్ష్యపు షాట్ ఆడి క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేరాడు. గత నాలుగేళ్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్లకు కోహ్లీ ఔటవ్వడం ఇది 12వ సారి. టెస్ట్ క్రికెట్లో ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్కు తడబడుతున్న కోహ్లీ.. పరిమిత ఓవర్ల క్రికెట్లో స్పిన్ బౌలింగ్ ఆడలేకపోతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తమ తదుపరి మ్యాచ్ను పాకిస్థాన్తో ఆడనుంది. ఈ మ్యాచ్కు ముందే కోహ్లీ తన స్పిన్ బలహీనతను అధిగమించాలని విరాట్ కోహ్లీకి హర్భజన్ సింగ్ సూచించాడు.

ఆటను ఆస్వాదించాలి..
అనవసర ఒత్తిడిని పక్కన పెట్టి ఆటను ఆస్వాదించాలన్నాడు. 'విరాట్ కోహ్లీ స్లోయర్ బౌలర్లు, లెగ్ స్పిన్నర్లతో కాస్త అసౌకర్యానికి గురవుతున్నాడు. లెగ్ స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు కోహ్లీ ప్రణాళికలు రచించాలి. ఫామ్లో లేనప్పుడు క్రీజులో సెట్ అయ్యేందుకు కాస్త సమయం పడుతోంది. విరాట్ కోహ్లీ విషయంలోనూ అదే జరుగుతోంది. క్రికెట్ ఓ గొప్ప గేమ్. ఎంత పెద్ద ఆటగాడైనా.. ఎంత పేరున్నా ఇక్కడ పనిచేయదు. ఆటగాళ్ల మదిలో ఉండే ఆలోచనలే ముందుకు నడిపిస్తాయి. బంగ్లాదేశ్తో మ్యాచ్లో.. క్రీజులో సెట్ అయ్యేందుకు ఎక్కువ సమయం తీసుకుంటున్నానే ఆలోచనతో కోహ్లీ స్టక్ అయ్యాడనిపించింది.
కోహ్లీ నువ్వు ఓ లెజెండ్..
అతను తన ఆటపై నమ్మకం ఉంచి ఆడాలి. అతను ఎవరికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అతను ఇప్పటికే ఛాంపియన్ ప్లేయర్. ఈ రోజు రిటైర్ అయినా.. అతన్ని ఛాంపియన్ ప్లేయర్గా చూస్తారు. తన ఆటతో దేశానికి ఎన్నో విజయాలు అందించాడనే చెబుతారు. ఇప్పుడు అతను చేయాల్సింది ఆటను ఆస్వాదించడమే. మదిలో నుంచి అనవసర ఒత్తిడిని తీసేయాలి.
బంగ్లాతో మ్యాచ్లో ఫామ్ అందుకోవాలని, పాకిస్థాన్తో మ్యాచ్కు రెడీ అవ్వాలనే ఆలోచన కోహ్లీ ఉన్నట్లు కనిపించింది. కానీ అలా జరగలేదు. చాలా స్లో ఇన్నింగ్స్ ఆడాడు. స్ట్రైక్ రొటేట్ చేయలేకపోయాడు. కానీ ఆస్ట్రేలియాలో కోహ్లీ లాఫ్టెడ్ కవర్ డ్రైవ్స్, స్వీప్ షాట్స్ ఆడటం మనం చూశాం.
బలహీతనను అధిగమించాలి..
అతను తనపై నమ్మకం పెంచుకోవాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటేనే కోహ్లీ ఫామ్ అందుకోగలడు. అతను పరుగులు చేయడం జట్టుకు అవసరం. తదుపరి మ్యాచ్ నుంచే కోహ్లీ పరుగులు చేయాలి. ఒకవేళ సెమీఫైనల్కు అఫ్గానిస్థాన్ వస్తే పరిస్థితి ఏంటి? అప్పుడు కోహ్లీ ముగ్గురు క్వాలిటీ స్పిన్నర్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి వీలైనంత త్వరగా కోహ్లీ ఈ బలహీనతను అధిగమించాలి. కోహ్లీ బ్యాటింగ్ చూసేందుకు అభిమానులంతా ఆసక్తిగా ఉన్నారు.'అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు. టీమిండియా తమ తదుపరి మ్యాచ్లో పాకిస్థాన్తో తలపడనుంది. ఆదివారం ఈ హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.