ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం టీమిండియా.. పాకిస్థాన్కు వెళ్లాలంటే భద్రతపై పూర్తి భరోసా ఇవ్వాలని దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. ఆటగాళ్ల భద్రత చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. 1996 వన్డే ప్రపంచకప్ తర్వాత ఓ ఐసీసీ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుండటం ఇదే తొలిసారి.
అయితే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తాము పాకిస్థాన్కు వెళ్లలేమని, తమ మ్యాచ్లను తటస్థ వేదికల్లో నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఐసీసీ కూడా ఛాంపియన్స్ ట్రోఫీ బడ్జెట్లో అదనపు బడ్జెట్ను కేటాయించింది. కానీ పీసీబీ మాత్రం పాకిస్థాన్ పర్యటనకు భారత్ రావాలని డిమాండ్ చేస్తోంది.

మరోవైపు ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ విభేదాల కారణంగా.. పాకిస్థాన్లో పర్యటించేందుకు టీమిండియాకు కేంద్ర ప్రభుత్వ అనుమతివ్వాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరి-మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది.
ఒకవేళ భారత్ జట్టు పాక్ గడ్డపైకి వెళ్లేందుకు ఇష్టపడకపోతే ట్రోఫీలో టీమిండియా ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్ లేదా శ్రీలంక లాంటి తటస్థ వేదికల్లో నిర్వహించే అవకాశం ఉంది. 2008 నుంచి భద్రతా కారణాలరీత్యా టీమిండియా పాకిస్థాన్లో పర్యటించడం లేదు. తాజాగా ఇదే వాదనతో ఏకీభవించిన హర్భజన్ సింగ్.. ప్లేయర్లకి భద్రత చాలా ముఖ్యమని స్పష్టం చేశాడు.
'పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లకు వాళ్లు చెప్పేది సరైన వాదనగానే అనిపించవచ్చు. కానీ మనం ఆటగాళ్ల భద్రత గురించి ఆలోచించాలి. భారత ఆటగాళ్ల భద్రతకు పాకిస్థాన్ భరోసా ఇవ్వకపోతే.. అక్కడికి వెళ్లాలని నేను కోరుకోవట్లేదు. జట్లకు పూర్తి భద్రత కల్పిస్తామని, ట్రోఫీ సమయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని వారు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంతిమంగా క్రికెట్ గురించే కాకుండా చాలా అంశాల గురించి ఆలోచించి భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఒక క్రికెటర్గా క్రికెట్ గురించి మాత్రమే నేను చెప్పగలను'అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.