
న్యూఢిల్లీ: భారత జట్టుకు సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ సేవలు అవసరం ఉండి, అతను అందుబాటులో ఉంటే ఎంపిక చేయాలని టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సూచించాడు. కరోనా కారణంగా ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడటంతో ధోనీ భవితవ్యంపై తీవ్ర చర్చజరుగుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ జరగకపోతే ధోనీ కెరీర్ ముగిసినట్లేనని విశ్లేషకులు, కొందరూ మాజీ క్రికెటర్లు అంచనా వేస్తుండగా.. మహీకి ఇంకా ఐపీఎల్ ఆడే సత్తా ఉందని మరికొంతమంది వాదిస్తున్నారు.
ఈ తరుణంలో చెన్నైసూపర్ కింగ్స్ ప్లేయర్ హర్భజన్ సింగ్ తమ కెప్టెన్ రిటైర్మెంట్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్కు ఎంతో చేసిన ధోనీని ఎలా జడ్జ్ చేస్తారని ప్రశ్నించాడు. 'ధోనీని ఎలా జడ్జ్ చేస్తారు? అతని ఐపీఎల్ ఫామ్ చూస్తారా? ముందు అతనికి గౌరవం ఇవ్వండి. అతనో గొప్ప కెప్టెన్ అనే వాస్తవాన్ని గ్రహించండి. ఇప్పటికే ధోనీ భారత క్రికెట్కు ఎంతో చేశాడు. ధోనీ ఓ పెద్ద ప్లేయర్. అతను సమర్ధుడా? కాదా? అని చెప్పే అవసరం ఏ మాత్రం లేదు. కాబట్టి దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అతను ఆడటానికి అందుబాటులో ఉండి, జట్టుకు అతని సేవలు అవసరమనిపిస్తే ఎలాంటి సందేహం లేకుండా జట్టులోకి తీసుకోవచ్చు.'అని భజ్జీ తెలిపాడు.
వెన్నుగాయంతో జట్టుకు దూరమైన టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను టీ20 వరల్డ్కప్ జట్టులోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. అతనిలాంటి ప్లేయర్లు జట్టుకు అవసరమని, ఐపీఎల్ ఫామ్తో సంబంధం లేకుండా ఎంపిక చేయాలన్నాడు.
'ప్రపంచకప్ తర్వాత హార్ధిక్ పాండ్యా మళ్లీ ఆడలేదు. అతను ఫిట్గా ఉంటే మాత్రం ఐపీఎల్తో సంబంధం లేకుండా జట్టులోకి తీసుకోవాలి. జట్టు సమతూకంగా ఉండాలంటే పాండ్యా వంటి ఆటగాళ్లు జట్టులో ఉండాలి. ఈ తరహా ఫ్లేయర్ల అవసరం కూడా జట్టుకు అవసరం. అంతకు ముందే తామేంటో నిరూపించుకున్న ప్లేయర్లను ఐపీఎల్ ఫామ్తో జడ్జ్ చేయలేం.'అని చెప్పుకొచ్చాడు.