హైదరాబాద్: మారుమూల చిన్న పట్టణం.. దిగువ మధ్యతరగతి కుటుంబం.. కావల్సినంత ప్రతిభ.. అవకాశాలు పరిమితం.. కష్టాలు అపరిమితం.. కుటుంబ బాధ్యతలు.. తండ్రి పడుతున్న కష్టాలు.. క్రికెట్ కెరీర్ కొనసాగించాలా.. ఉద్యోగంలో కొనసాగాలా.. ఇలాంటి పరిస్థితి నుంచి భారతీయ క్రికెట్లో తారజువ్వలా దూసుకొచ్చిన ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ.!
టీ20 ప్రపంచకప్.. వన్డేప్రపంచకప్.. చాంపియన్స్ ట్రోఫీ..అన్ని ఫార్మాట్లలో నెంబర్ వన్. దాదాపు క్రికెట్లో ఉన్న టైటిల్లన్నీ అందించిన ఏకైక సారథి.. విజయాన్ని అందరి ఖాతాలో వేసి.. అపజయాన్ని తన ఖాతాలో వేసుకునే గొప్ప దార్శనికుడు. భారత క్రికెట్ గతిని మార్చి.. కొన్ని కోట్ల మందికి ఆదర్శంగా నిలిచిన డైనమైట్.

అర్జునుడి రథానికి కృష్ణుడిలా.. అతిరథ మహారథుల బృందానికి నాయకుడిగా విజయాలందించిన మహేంద్రుడు నేడు(జూలై 7) 42వ జన్మదినం జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఈ భారత డైనమైట్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ.. మైఖేల్ తెలుగు ప్రత్యేక కథనం.!
గోల్డెన్ డకౌట్తో షురూ..
సౌరవ్ గంగూలీ సారథ్యంలో 2004లో బంగ్లాదేశ్పై వన్డేల్లోకి అరంగేట్రం చేసిన మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ జర్నీ.. గోల్డెన్ డకౌట్తో మొదలైనా తర్వాత దేశ క్రికెట్ గతినే మార్చే స్థాయికి ఎదిగింది. అన్ని ఫార్మాట్లలో కలిపి 17,266 రన్స్ చేసిన మహీ 350 వన్డేలు, 90 టెస్ట్లు, 98 టీ20ల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించాడు. 829 ఔట్లలో పాలుపంచుకొని వరల్డ్ బెస్ట్ కీపర్లలో ఒకడిగా భారత్ బెస్ట్గా వెలుగొందుతున్నాడు.
ఆ సిక్స్ ఇప్పటికీ..
ఒత్తిడిలో మరింత కూల్గా ఉండే ధోనీ కెప్టెన్గా ఎన్నో ఘనతలు సాధించాడు. అతని నాయకత్వంలో పరిమిత ఓవర్లలో భారత్ తిరుగులేని శక్తిగా ఎదిగింది. 2007లో టీ20 ప్రపంచకప్ సాధించి దేశ క్రికెట్కు సరికొత్త బాట చూపిన ఈ రాంచీ వీరుడు.. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్తో పాటు చిరకాలం గుర్తుండిపోయే సిక్సర్తో 2011 ప్రపంచకప్తో యావత్ దేశం ఉప్పొంగేలా చేశాడు.

ఐపీఎల్లోనూ..
2013లో చాంపియన్ ట్రోఫీ కూడా సాధించి ఐసీసీ మూడు మేజర్ టైటిళ్లు గెలిచిన ఏకైక కెప్టెన్గా అందరి ప్రశంసలు అందుకున్నాడు. అంతేకాదు టెస్టులు, వన్డేల్లో భారత్కు నంబర్ వన్ ర్యాంక్ సాధించిపెట్టాడు. ఐపీఎల్లోనూ మహేంద్రుడిదే హవా. అతని కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ ఐదు టైటిల్స్ అందుకుంది. చాంపియన్స్ లీగ్లోరెండు సార్లు విజేతగా నిలిచింది.

2014లో టెస్టులకు వీడ్కోలు పలికిన మహీ.. 2017లో వన్డే, టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. 2-3 సంవత్సరాలు విరాట్ కోహ్లీకి అండగా ఉంటూ.. బ్యాట్స్మన్, కీపర్గా కొనసాగాడు. 2019 ప్రపంచకప్లో రనౌట్గా వెనుదిరగడంతో మొదటిసారి మహీ రిటైర్మెంట్ వార్తలు వెలుగులోకి వచ్చాయి. యాదృశ్చికంగా ధోనికి అదే చివరి మ్యాచ్ కావడం విశేషం.
అదొక్కటే..
ఏడాదిపాటు ఆటకు దూరంగా ఉన్న అతడు 2020 ఆగస్టు 15న రాత్రి 7.29 గంటలకు అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ఇచ్చాడు. అయితే భారత క్రికెట్కు ఎంతో చేసిన ధోనీకి సరైన రీతిలో వీడ్కోలు దక్కలేదు. సచిన్ టెండూల్కర్ తరహాలో ఆటకు సగర్వంగా వీడ్కోలు పలికితే చూడాలని కలలు కన్న అభిమానులకు నిరాశే ఎదురైంది.

అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన ఐపీఎల్లో తన మహిమలు చూపిస్తూ అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. బ్యాటర్గా కాస్త బలహీనమైనా.. కెప్టెన్గా, వికెట్ కీపర్గా ఇప్పటికీ ధోనీకి తిరుగులేదు.