
16 ఏళ్లకే భారీ సెంచరీ..
రాయుడు కెరీర్ ఘనంగా ప్రారంభమైంది. ఇంగ్లండ్ గడ్డపై జరిగిన యూత్ వన్డేలో రాయుడు 16 ఏళ్ల వయసులోనే సెంచరీ బాదాడు. 114 బంతుల్లో 177 పరుగులు చేశాడు. లియాం ప్లంకెట్, సమిట్ పటేల్ వంటి ఆటగాళ్లు ఆ మ్యాచ్ ఆడారు. ఆ మరుసటి ఏడాది రంజీ క్రికెట్లో హైదరాబాద్ తరఫున ఆంధ్ర జట్టుపై వరుసగా రెండు ఇన్నింగ్స్ల్లో 210, 159 నాటౌట్ పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్లతో అందరి దృష్టిని ఆకర్షించాడు. భారత క్రికెట్ భవిష్యత్ స్టార్ అంటూ సునీగవాస్కర్ వంటి దిగ్గజ ఆటగాళ్లు కొనియాడారు. 2004 అండర్ 19 ప్రపంచకప్ టీమ్లో శిఖర్ ధావన్, సురేశ్ రైనా, దినేశ్ కార్తీక్, రాబిన్ ఊతప్పలతో కలిసి ఆడాడు. దాంతో రాయుడు.. అజారుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్ వారుసుడిగా భారత జట్టుకు ఆడుతాడని అంతా అనుకున్నారు.

అర్జున్ యాదవ్తో గొడవ..
రాయుడు సహజంగానే భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేడు. గుంటూరు మిర్చిలా ముక్కుసూటిగా ఉండే అతను అనవసర గొడవల్లో ఇన్వాల్వ్ అయ్యి కెరీర్ నాశనం చేసుకున్నాడు. రంజీ క్రికెట్ ఆడే సమయంలో భారత దిగ్గజ క్రికెటర్, మాజీ బీసీసీఐ ప్రెసిడెంట్ శివలాల్ యాదవ్ కుమారుడు అర్జున్ యాదవ్తో గొడవపెట్టుకున్నాడు. భౌతికంగా కూడా కొట్టుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దాంతో రాయుడి కెరీర్ డేంజర్ జోన్లో పడింది. బోర్డులో కీలకమైన శివలాల్ యాదవ్ నుంచి అతనికి సమస్యలు ఎదురయ్యాయి. దాంతో 21 ఏళ్ల వయసులోనే బీసీసీఐకి రెబల్గా ఏర్పడిన ఇండియన్ క్రికెట్ లీగ్(ఐసీఎల్)లో చేరి ఘోర తప్పిదం చేశాడు. దాంతో అతనిపై నిషేధం పడింది. ఐసీఎల్ ఆడకుండా ఉండి ఉంటే... రాయుడు కచ్చితంగా 2007 టీ20 వరల్డ్ కప్ ఆడేవాడు. టీమిండియా స్టార్గా ఎదిగేవాడు. 2009 తర్వాత నిషేధం ఎత్తేయడంతో రాయుడు మళ్లీ మెయిన్ స్ట్రీమ్ క్రికెట్లోకి వచ్చాడు.

ముంబై ఇండియన్స్తో గాడిన పడినా..
అతని కెరీర్ మళ్లీ గాడిలో పడింది. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ఎంపికవ్వడం, బరోడా తరఫున రంజీ క్రికెట్ ఆడటం కలిసొచ్చింది. ముంబై టైటిళ్లు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2013లో తొలిసారి టీమిండియాకు ఎంపికయ్యాడు. 2015 వన్డే ప్రపంచకప్కు ఎంపికైన తుది జట్టులో చోటు దక్కలేదు. ఆ తర్వాత జట్టుకు దూరమైనా.. 2018 ఐపీఎల్లో సీఎస్కే తరఫున దుమ్మురేపాడు. దాంతో మళ్లీ టీమిండియా పిలుపును అందుకున్నాడు. ఆ టైమ్లో టీమిండియాను వేధిస్తున్న నాలుగో నెంబర్కు అతనే సరైనోడని అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. అయితే యో యో టెస్ట్ విఫలమవడం.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ల్లో వరుసగా మూడు మ్యాచ్ల్లో విఫలమవడం అతనికి తీవ్ర నష్టం చేసింది. మేనేజ్మెంట్ సైతం అతనికి అండగా నిలవలేదు.

చిచ్చురేపిన త్రీడీ ట్వీట్..
ఆస్ట్రేలియాతో చివరి రెండు వన్డేల్లో అతనికి అవకాశం ఇవ్వాల్సిందనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే టీమిండియాకు ఆరో బౌలింగ్ ఆప్షన్ అవసరమైంది. కేదార్ జాదవ్ విఫలమవుతుండటంతో.. సెలెక్టర్లు బౌలింగ్ ఆల్రౌండర్ కోసం అన్వేషించారు. అప్పుడే విజయ్ శంకర్ వారి కళ్లలో పడ్డాడు. మరోవైపు రాయుడు విఫలమవుతుండటం.. శంకర్ రూపంలో బౌలింగ్, బ్యాటింగ్ ఆప్షన్ కనబడటంతో మేనేజ్మెంట్ అతన్ని ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాలకే చెందిన ఎమ్మెస్కే ప్రసాద్ చీఫ్ సెలెక్టర్గా ఉండి కూడా రాయుడికి అండగా ఉండలేకపోయాడు. విజయ్ శంకర్ త్రీడీ ప్లేయరంటూ కామెంట్ చేశాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రాయుడు 'త్రీడీ గ్లాస్ ఆర్డర్ చేశా. ప్రపంచకప్ను వాటితోనే చూస్తా'అని టీమ్ సెలెక్షన్పై సెటైర్లు పేల్చాడు. ఇది బీసీసీఐకి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దాంతో స్టాండ్ బై ప్లేయర్గా ఉన్నా.. అవకాశం వచ్చినా రాయుడిని తీసుకోలేదు. దాంతో రాయుడి అంతర్జాతీయ కెరీర్కు ఎండ్ కార్డ్ పడింది. బీసీసీఐపై కోపంతో రిటైర్మెంట్ ప్రకటించిన రాయుడు.. యూటర్న్ తీసుకోని ఐపీఎల్లో ఆడుతున్నాడు.


Click it and Unblock the Notifications












