న్యూఢిల్లీ: తాను నెమ్మదిగా మాత్రమే ఆడుతానని అందరికి ఓ దురభిప్రాయం ఉందని టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్, తెలుగు తేజం హనుమ విహారి అన్నాడు. పరిస్థితులకు తగ్గట్లు దూకుడుగా ఆడే సత్తా కూడా తనకు ఉందని తెలియజేశాడు. ప్రస్తుతం దులీప్ ట్రోఫీ ఆడుతున్న హనుమ విహారి.. సౌత్ జోన్ టీమ్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.
అతని సారథ్యంలోని సౌత్ జోన్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్కు దూసుకెళ్లింది. బుధవారం ప్రారంభమయ్యే ఫైనల్లో వెస్ట్ జోన్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన హనుమ విహారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక కాకపోవడంపై స్పందించాడు. జట్టు నుంచి తనను ఎందుకు తప్పించారో తెలియదన్నాడు.

'భారత టెస్ట్ టీమ్ నుంచి నన్ను ఎందుకు తప్పించారో తెలియదు. నాకు అవకాశం వచ్చినప్పుడల్లా జట్టు విజయం కోసం నా వంతు కృషి చేశా. బహుశా ఆ ప్రదర్శన సరిపోకపోవచ్చు. నా ఆటను మరింత మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తా. జట్టు నుంచి ఎందుకు తప్పించారనే విషయాన్ని ఎవరూ చెప్పలేదు. దీని గురించి నేను దిగులు కూడా చెందడం లేదు.
నేను నెమ్మదిగానే ఆడుతాననే దురభిప్రాయం చాలా మందికి ఉంది. టెస్ట్ క్రికెట్ చాలా భిన్నమైనది. పరిస్థితులకు తగ్గట్లు ఆడాల్సి ఉంటుంది. దులీప్ ట్రోఫీ ఫైనల్లో ధాటిగా ఆడాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి బ్యాటింగ్ ఝులిపించాల్సి వచ్చింది.'అని విహారీ చెప్పుకొచ్చాడు. నార్త్ జోన్తో జరిగిన రెండో సెమీఫైనల్, రెండో ఇన్నింగ్స్లో విహారీ 42 బంతుల్లో 43 పరుగులు చేసి సౌత్ జోన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
గతేడాది ఇంగ్లండ్తో జరిగిన చివరి టెస్ట్ నుంచి భారత జట్టులో విహారీకి చోటు దక్కలేదు. అతను భారత్ తరఫున 16 టెస్టుల్లో 33.56 సగటుతో 839 పరుగులు చేశాడు. టీమిండియా చివరిసారి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు చారిత్రక టెస్ట్ సిరీస్ విజయంలోనూ విహారి కీలకపాత్ర పోషించాడు. అయితే ఆ తర్వాత ఫామ్ కోల్పోవడంతో సెలక్టర్లు అతనిపై వేటు వేశారు.
ఈ ఏడాది బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ నుంచి కూడా బీసీసీఐ అతన్ని తొలగించింది. 29 ఏళ్ల విహారి దేశవాళీ క్రికెట్లో ఆంధ్ర జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. అయితే అతను ఆంధ్ర జట్టు నుంచి మధ్యప్రదేశ్కు మారుతున్నాడనే వార్తలు వచ్చాయి.