
మరిచిపోలేని టెస్టు సిరీస్:
ప్రస్తుతం హనుమ విహారి జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రీహాబిలిటేషన్తో గాయం నుంచి కోలుకునే ప్రయత్నంలో ఉన్నాడు. తాజాగా విహారి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'చరిత్రాత్మక టెస్టు సిరీస్ విజయంలో భాగం కావడం సంతోషంగా ఉంది. మరిచిపోలేని టెస్టు సిరీస్ ఇది. కొద్ది రోజుల క్రితం మేం ఉన్న స్థితి నుంచి సిరీస్ గెలుపు వరకు చూస్తే అంతా అద్భుతంలా కనిపించింది. చరిత్రలో అతి గొప్ప విజయాల్లో ఇది ఒకటిగా నిలిచిపోతుంది. ఇందులో నేనూ ఉండటం గర్వంగా అనిపిస్తోంది. చివరి టెస్టులో మా వాళ్లంతా చాలా బాగా ఆడారు. వారిని అక్కడ చూస్తుంటే నేనూ ఉంటే బాగుండేదనిపించింది. విజయపు వేడుకల్లో భాగం కాలేకపోవడం సహజంగానే నిరాశ కలిగించింది. నేను తర్వాతి మ్యాచ్ ఆడలేనని సిడ్నీలోనే తేలిపోయింది. ఎన్సీఏకి వెళ్లి గాయం నుంచి కోలుకునేందుకు సాధ్యమైనంత త్వరగా రీహాబిలిటేషన్ ప్రారంభించాలని చెప్పడంతో సిడ్నీ నుంచి రావాల్సి వచ్చింది' అని తెలిపాడు.

ఏం జరిగినా ఆడాలనుకున్నా:
'అడిలైడ్ ఓటమి తర్వాత మెల్బోర్న్ టెస్టులో అద్భుతంగా పుంజుకున్నాం. సిడ్నీ మూడో టెస్టులో మరింత పట్టుదలగా ఆడాం. పుజారా క్రీజులో ఉన్నంత వరకు గెలుపుపై నమ్మకంతోనే ఉన్నాం. అతను ఔటవడంతో కాస్త ఆలోచనలో పడ్డాం. అప్పటికే నేను గాయంతో ఇబ్బంది పడుతున్నా. పరుగెత్తడం సంగతి అటుంచితే.. కనీసం నడవలేకపోయా. ఆర్ అశ్విన్ 100 శాతం ఫిట్నెస్తో లేడు. గాయం కారణంగా జడేజా కూడా అందుబాటులో లేడు. డ్రా చేసి సిరీస్పై ఆశలను సజీవంగా ఉంచాలని భావించాం. ఏకాగ్రత కోల్పోకుండా.. చివరి వరకు బ్యాటింగ్ చేశాం. నొప్పి పెరిగిపోవడంతో నివారణ ఇంజక్షన్ తీసుకున్నాను. బలవంతంగా ఆటలో కొనసాగితే గాయం తీవ్రమయ్యే ప్రమాదం ఉందనే విషయం గురించి ఆలోచించలేదు. రెండు టెస్టుల్లో విఫలమైన తర్వాత కూడా నన్ను నమ్మి మేనేజ్మెంట్ నాకు అవకాశం ఇచ్చింది. దానిని నిలబెట్టుకునేందుకు ఏం జరిగినా ఆడాలనుకున్నా. బంతి బంతికీ అశ్విన్, నేను మాట్లాడుకున్నాం. అశ్విన్కు తెలుగు వచ్చు. అతడు తమిళం, తెలుగులో నన్ను ప్రోత్సహిస్తూ వచ్చాడు' అని పేర్కొన్నాడు.

ఆనందం రెట్టింపైంది:
'ఆసీస్ గడ్డపై అప్పటి వరకు భారత్ ఒక్కసారీ సిరీస్ నెగ్గలేదు. కాబట్టి నాడు అది చాలా ప్రత్యేకంగా అనిపించింది. అయితే ఇప్పుడు ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో తాజా విజయం మరింత మధురంగా అనిపిస్తోంది. నా వరకు చూస్తే రెండు సిరీస్లలోనూ నేను జట్టులో సభ్యుడిగా ఉన్నాను కాబట్టి నా ఆనందం రెట్టింపైంది. దీనిని మాటల్లో చెప్పలేను. ఇంతకంటే ఇంకేం ఆశించగలను. నిజానికి క్వారంటైన్, బయో బబుల్ చాలా కఠినంగా అనిపించాయి. అయితే ఇంత ప్రతిష్టాత్మక సిరీస్ ఆడుతున్న సమయంలో ఇతర విషయాలను పెద్దగా పట్టించుకోవద్దని మేమందరం గట్టిగా అనుకున్నాం కాబట్టి అది ఇబ్బంది కాలేదు. ఈ రెండు పర్యటనల మధ్య బ్యాట్స్మన్గా కూడా నేను ఎంతో మెరుగయ్యాను' అని హైదరాబాద్ క్రికెటర్ చెప్పాడు.

అమ్మకు ఫోన్ చేస్తే:
'మ్యాచ్లో గెలిచినప్పుడు ఉండే భావోద్వేగం సిడ్నీ టెస్టు డ్రా తర్వాత కనిపించింది. డ్రెస్సింగ్ రూమ్లో అందరూ చాలా సంతోషించారు. నొప్పి గురించి అందరూ నన్ను అడిగారు. తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మ్యాచ్ తర్వాత అమ్మకు ఫోన్ చేశా. నా ఆటతీరు పట్ల చాలా సంతోషించింది. అందరూ మెచ్చుకుంటున్నారని.. చాలా గర్వంగా ఉందని చెప్పింది. ఇక క్రీడాకారుల కెరీర్లో గాయాలు సహజం. గాయపడినప్పుడు కోలుకోవడంపైనే దృష్టి ఉండాలి. అంతకుమించి ఏమీ చేయలేం. ఇంగ్లండ్తో తొలి రెండు టెస్టులకు ఎంపిక కాలేదు కానీ మూడో టెస్టులోగా కోలుకొని జట్టులోకి వస్తానని నమ్మకముంది' అని విహారి ధీమా వ్యక్తం చేశాడు.
ISL 2020 21: బెంగళూరు చిత్తు.. కేరళ బ్లాస్టర్స్ ఖాతాలో మరో విజయం!!


Click it and Unblock the Notifications
