టీమిండియా వెటరన్ క్రికెటర్, తెలుగు తేజం హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్(ఎన్ఓసీ) లభించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి భారీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుండటంతో ఏసీఏ.. హనుమ విహారికి మంగళవారం ఎన్ఓసీ ఇచ్చింది.
మధ్యక్రికెట్ బోర్డుకు మారేందుకు హనుమ విహారి గత రెండు నెలలుగా ఏసీఏ ఎన్ఓసీ ఇవ్వాలను కోరుతున్నాడు. కానీ ఏసీఏ అతని విన్నపాన్ని పట్టించుకోలేదు. తాజాగా ప్రభుత్వం మారుతుండటంతో ఎన్ఓసీ జారీ చేసిందని హనుమ విహారి సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. తన ఎన్ఓసీకి సంబంధించి హనుమ విహారి వరుస ట్వీట్లు చేశాడు.

తన ఎన్ఓసీని సోమవారం సిద్దం చేసి.. ఎన్నికల ఫలితాల తర్వాత మెయిల్ చేశారని హనుమ విహారి తెలిపాడు. 'ఎన్ఓసీ ఇవ్వాలని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ను గత రెండు నెలలుగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నాలుగు సార్లు మెయిల్ చేశాను. కానీ నా రిక్వెస్ట్ను వారు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు రాష్ట్రంలోని పరిస్థితులు మారడంతో అత్యవసరంగా ఎన్ఓసీ జారీ చేశారు.'అని మెయిల్ స్క్రీన్ షాట్, లెటర్ను హనుమ విహార్ తన్ ట్వీట్కు జత చేశాడు.
మరో ట్వీట్లో ఎన్ఓసీని ఒక రోజు ముందుగానే సిద్దం చేసి ఎన్నికల ఫలితాల తర్వాత పంపించాడని పేర్కొన్నాడు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయం సాధించడంపై టీమిండియా వెటరన్ క్రికెటర్, తెలుగు తేజం హనుమ విహారి సంతోషం వ్యక్తం చేశాడు. సోషల్ మీడియా వేదికగా కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. 175 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కూటమి సభ్యులు 160 ప్లస్ సీట్లలో విజయం దిశగా దూసుకెళ్తున్నారు.
మరోవైపు 151 సీట్లతో అధికారం చేపట్టిన వైఎస్సార్సీపీ 20 లోపు సీట్లకే పరిమితమైంది. ఈ విజయం పవన్ కళ్యాణ్ పదేళ్ల కష్టానికి దక్కిన ఫలితమని హనుమ విహారి అభిప్రాయపడ్డాడు. 'పదేళ్ల పట్టుదల, ప్రణాళిక.. ఇప్పుడు పవర్. ఘన విజయం సాధిస్తున్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేశ్కు శుభాకాంక్షలు'అని హనుమ విహారి ట్వీట్ చేశాడు.
ఎన్నికలకు ముందు హనుమ విహారి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ)లోనూ వైఎస్సార్సీపీ తలదూర్చిందని, తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు. ఏసీఏ రాజకీయాలకు తాను బలయ్యానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఓ వైఎస్సార్సీపీ కార్పోరేటర్ కొడుకును తిట్టానని తనను ఆంధ్ర జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించారని ఆరోపించాడు.