టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు ఘోర అవమానం ఎదురైంది. సొంత అభిమానులే గంభీర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గంభీర్ను హెడ్ కోచ్ పదవి బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ.. గట్టిగా అరిచారు. సౌతాఫ్రికాతో రెండో టెస్ట్ పరాజయాన్ని అభిమానులు తట్టుకోలేకపోయారు. గంభీర్ ముందే తమ అసంతృప్తిని తెలియజేశారు.
గౌహతి వేదికగా బుధవారం ముగిసిన రెండో టెస్ట్లో టీమిండియా 408 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో రెండు టెస్ట్ల సిరీస్ భారత్ 0-2తో క్లీన్ స్వీప్ అయ్యింది. 93 ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా టీమిండియాకు ఇదే అతిపెద్ద ఘోర పరాజయం. మరోవైపు 25 ఏళ్ల తర్వాత భారత గడ్డపై సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ విజయాన్నందుకుంది. గంభీర్ హయాంలో ఇది వరుసగా రెండో టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ కావడంతో అభిమానులు తీవ్ర అసహనానికి గురయ్యారు.

బహుమతి ప్రదానోత్సవం కోసం జట్టుతో కలిసి గంభీర్ మైదానంలోకి రాగా.. అతను రాజీనామా చేయాలంటూ స్టాండ్స్ నుంచి అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్తో పాటు సహాయ సిబ్బంది నిశబ్దంగా ఉండాలని వారించినా అభిమానులు శాంతించలేదు. మరోవైపు ఈ నినాదాలతో గంభీర్ ఖంగుతిన్నాడు. తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.
ఈ మ్యాచ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న గంభీర్ను తన భవితవ్యంపై మీడియా ప్రశ్నలు సంధించింది. వాటికి గంభీర్ సూటిగా బదులిచ్చాడు. తన భవితవ్యంపై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పాడు. అయితే తన హయాంలో టీమిండియా సాధించిన విజయాలను జనాలు మరిచిపోయారని, ఓటములనే గుర్తు పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
'నా భవితవ్యంపై నిర్ణయం తీసుకోవాల్సింది బీసీసీఐ. జట్టు కంటే ఎవరూ గొప్ప కాదు. నేను ఎప్పుడూ చెప్పే మాట ఇది. ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా సాధించిన విజయాలను మరిచిపోయిన జనాలు.. న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాజయం గురించే మాట్లాడుతారు. నేను ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్లోనూ జట్టును గెలిపించాను.'అని తెలిపాడు.
549 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భాగంగా 27/2 ఓవర్నైట్ స్కోర్తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన భారత్.. రెండో ఇన్నింగ్స్లో 140 పరుగులకే కుప్పకూలింది. భారత బ్యాటర్లలో రవీంద్ర జడేజా(87 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 54) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో సిమన్ హర్మర్(6/37) ఆరు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించగా.. కేశవ్ మహరాజ్(2/37) రెండు వికెట్లు పడగొట్టాడు. మార్కో జాన్సెన్, సీనర్ ముత్తుసామి తలో వికెట్ తీసారు.
Gautham gambhir dont deserve this,I also hate him but doesn't mean you should attack him like this, there is a limit a coach can do player have to do something themself also and agarkar also deserve the same level hate then but he not getting pic.twitter.com/gTc8qz3snF
— SmithianEra (@Trexsnyder2345) November 26, 2025