ఇంగ్లండ్తో ఆఖరి టెస్ట్లో టీమిండియా తడబాటు కొనసాగుతోంది. తొలి రోజు ఆటలో అతి కష్టం మీద 200 పరుగుల మార్క్ అందుకున్న టీమిండియా.. రెండో రోజు ఆట ఆరంభంలోనే ప్యాకప్ అయ్యింది. ఓవర్ నైట్ స్కోర్కు 20 పరుగులు మాత్రమే జోడించి ఆలౌటైంది. 204/6 ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్ 69.4 ఓవర్లలో 224 పరుగులకు కుప్పకూలింది. ఓవర్నైట్ బ్యాటర్లు కరుణ్ నాయర్(109 బంతుల్లో 8 ఫోర్లతో 57), వాషింగ్టన్ సుందర్(55 బంతుల్లో 3 ఫోర్లతో 26) త్వరగానే వెనుదిరగడం.. భారత్ పతనాన్ని శాసించింది.
ఓవర్నైట్ స్కోర్ కరుణ్ నాయర్ 5 పరుగులే జోడించగా.. వాషింగ్టన్ సుందర్ 7 పరుగులే చేసి వెనుదిరిగాడు. మహమ్మద్ సిరాజ్(0), ప్రసిధ్ కృష్ణ(0) డకౌటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో గస్ అట్కిన్సన్(5/33) ఐదు వికెట్లు తీయగా.. జోష్ టంగ్(3/57) మూడు వికెట్లు పడగొట్టాడు. క్రిస్ వోక్స్కు ఓ వికెట్ దక్కింది.

రెండో రోజు ఆటను కరుణ్ నాయర్, సుందర్ దూకుడుగా ప్రారంభించారు. జోష్ టంగ్ బౌలింగ్లో ఎదుర్కొన్న తొలి బంతిని నాయర్ బౌండరీ తరలించగా.. సుందర్ కూడా బౌండరీ బాదాడు. అతని మరుసటి ఓవర్లో కరుణ్ నాయర్ వికెట్లు ముందు దొరికిపోయాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. గస్ అట్కిన్సన్ బౌలింగ్లో సుందర్ క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. తన మరుసటి ఓవర్లో సిరాజ్ను క్లీన్ బౌల్డ్ చేసిన అట్కిన్సన్.. ప్రసిధ్ కృష్ణను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చి భారత ఇన్నింగ్స్కు తెరదించడంతో పాటు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు.