ఆసియా కప్ 2025 టోర్నీ జరుగుతున్న తీరుపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదేం దిక్కుమాలిన టోర్నీ అని మండిపడుతున్నారు. ఆసియా కప్ 2025 కంటే గల్లీ క్రికెట్ ఎంతో నయమని అభిప్రాయపడుతున్నారు. యూఏఈ వేదికగా మంగళవారం ప్రారంభమైన ఈ టోర్నీలో ఇప్పటి వరకు రెండు మ్యాచ్లు జరిగాయి. కానీ ఈ రెండు మ్యాచ్లు పూర్తిగా ఏకపక్షంగా ముగిసాయి. సాధారణంగా టీ20 మ్యాచ్లు హోరాహోరీగా సాగుతాయి. బౌండరీల మోతతో అభిమానులకు కావాల్సిన మజా లభిస్తోంది. ఆఖరి బంతి వరకు ఫలితం రెండు జట్లను ఊరిస్తోంది. కానీ ఆసియా కప్ 2025లో మాత్రం అలా జరగడం లేదు. ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్లు పూర్తిగా సాగలేదు.
ఆసియా క్వాలిఫయర్స్ టీమ్.. కనీసం 20 ఓవర్లను కూడా ఆడలేకపోతున్నాయి. అంతేకాకుండా బిగ్ నేషన్స్ మధ్య కాకుండా చిన్నదేశాల మ్యాచ్లతో ఈ టోర్నీని ప్రారంభించడం కూడా నెటిజన్లకు ఆగ్రహం తెప్పిస్తోంది. అఫ్గానిస్థాన్, హాంగ్ కాంగ్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హాంగ్ కాంగ్ 94 పరుగులే చేసి ఘోర పరాజయాన్ని అందుకుంది.

బుధవారం ఆతిథ్య యూఏఈతో జరిగిన మ్యాచ్ అయితే మరీ దారుణంగా ముగిసింది. ఈ టీ20 మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లు కలిపి 20 ఓవర్ల ఆట కూడా జరగలేదు. ముందుగా బ్యాటింగ్ చేసిన యూఏఈ.. భారత బౌలర్ల ధాటికి 13.1 ఓవర్లలో 57 పరుగులకే కుప్పకూలింది. 58 పరుగుల లక్ష్యాన్ని భారత్ 27 బంతుల్లోనే పూర్తి చేసింది. చిన్న దేశమే అయినా.. క్రికెట్పై ఉన్న అభిమానంతో ఈ మ్యాచ్ను చూసిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కనీసం 20 ఓవర్ల ఆట కూడా జరగకపోతే ఎలా? అని నిట్టూరుస్తున్నారు.
అసలు ఆసియా కప్ 2025లో భారత్కు గట్టి పోటీనిచ్చే జట్టే కనబడటం లేదని, ఈ టోర్నీ ఆడటం బీసీసీఐ మానుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు. ఈ టోర్నీని భారత తృతీయ శ్రేణి జట్టు కూడా గెలుస్తుందని జోస్యం చెబుతున్నారు. భారత్లో ఏ దేశవాళీ టీమ్ తీసుకున్నా.. హాంగ్ కాంగ్, యూఏఈ కంటే మెరుగైన ప్రదర్శన చేస్తాయని అభిప్రాయపడుతున్నారు. ఆసియా కప్ కంటే గల్లీ క్రికెట్ ఎంతో నమయని కామెంట్ చేస్తున్నారు.
టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆసియా కప్ 2025లో భారత్కు గట్టి పోటీనిచ్చే జట్లే లేవన్నాడు. కనీసం సౌతాఫ్రికా, భారత్-ఏ జట్లను అయినా చేర్చి ఉంటే టోర్నీ రసవత్తరంగా సాగేదని అభిప్రాయపడ్డాడు. 'ఆసియా కప్ టోర్నీని మరింత రసవత్తరంగా మార్చాలంటే చాలా మార్పులు చేయాలి. ఈ ఎడిషన్లో సౌతాఫ్రికా జట్టును చేర్చి ఆఫ్రో-అసియా కప్గా నిర్వహిస్తే బాగుండేది. కనీసం భారత్-ఏ జట్టును అయినా అదనంగా బరిలోకి దింపినా రసవత్తర పోరు ఉండేది. బంగ్లాదేశ్ గురించి ఎక్కువగా మాట్లాడలేం. ఆ జట్టులో పెద్దగా ఏమీ లేదు. ఇతర జట్ల సంగతి కూడా సరేసరి. ఇవన్నీ భారత్కు ఏ మాత్రం పోటీనివ్వగలవు..?
చాలామంది అనుకున్నట్లుగా వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ కప్ కోసం సన్నద్ధమయ్యేందుకు ఈ టోర్నీ ఏ మాత్రం పనికిరాదు. ఇందులో పెద్ద పోటీనే ఉండదు. అఫ్గానిస్థాన్ బౌలింగ్ను చూశాక నాకు ఇదే అభిప్రాయం కలిగింది. ఒకవేళ భారత్తో మ్యాచ్లో 170+ పరుగుల లక్ష్యం ఎదురైతే అఫ్గాన్ ఛేదించగలదా? అసాధ్యం అనుకుంటున్నా. టీమిండియాను ఓడించాలంటే ఏ జట్టుకైనా ఆ రోజు బాగా కలిసిరావాలి. టీ20ల్లో చివరివరకూ థ్రిల్లింగ్గా జరుగుతాయి. కానీ, ఆసియా కప్లోనూ భారత్ మ్యాచ్లు ఏకపక్షమే.'అని అశ్విన్ పేర్కొన్నాడు.