గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీతో కొనసాగాలని ఆ జట్టు మాజీ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను కన్విన్స్ చేయలేదని హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా తెలిపాడు. ముంబై ఇండియన్స్ కాకుండా మరో ఫ్రాంచైజీకి వెళ్తానంటే ఆ పని చేసేవాళ్లమని, కానీ 5-6 ఏళ్లు తాను ప్రాతినిథ్యం వహించిన ఫ్రాంచైజీకే వెళ్తాననడంతో పోతే పోనీ అనుకున్నామని స్పష్టం చేశాడు.
ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ క్యాష్ ట్రేడింగ్ డీల్ ద్వారా కొనుగోలు చేసింది. జట్టులోకి తీసుకొచ్చిన వెంటనే ఐదు టైటిళ్లు గెలిపించిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాను తమ నూతన కెప్టెన్గా ప్రకటించింది. అయితే ముంబై ఇండియన్స్ కోరిన వెంటనే హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ ఇచ్చేయడం అందర్నీ ఆశ్చర్య పరిచింది.

పోతే పోనీ అనుకున్నాం..
ఇదే విషయాన్ని ఆ జట్టు హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రాను ప్రశ్నించగా ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. 'గుజరాత్ టైటాన్స్లోనే కొనసాగేలా హార్దిక్ పాండ్యాను నేను కన్విన్స్ చేయలేదు. ముంబై ఇండియన్స్ కాకుండా మరో జట్టుకు వెళ్తే మాత్రం అతన్ని ఆపే ప్రయత్నం చేసేవాడిని. కానీ 5-6 ఏళ్ల పాటు ప్రాతినిథ్యం వహించిన తన పాత ఫ్రాంచైజీకే వెళ్తానని చెప్పడంతో కాదనలేకపోయాను.
ఐపీఎల్ కొనసాగుతున్న విధానం ఇది. సాకర్, బాస్కెట్ బాల్ ఫ్రాంచైజీ లీగ్స్ల సంస్కృతి ఐపీఎల్కు కూడా వచ్చిందని చాలా మంది అంటున్నారు. కాబట్టి ఇలాంటి ట్రేడ్స్ మనం ఇంకా చాలా చూడబోతున్నాం. హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ కచ్చితం మిస్సవుతుంది. అయితే మా జట్టు తరఫున అతనికి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాం.
కెప్టెన్ శుభ్మన్ గిల్ కోసం..
మా నూతన సారథి శుభమన్ గిల్ జట్టు ఎలా నడిపిస్తాడో చూసేందుకు ఉత్సాహంగా ఉన్నా. నేను ఒక్కడినే కాదు యావత్ భారత్.. అతన్ని కెప్టెన్గా చూడాలనుకుంటోంది. మూడు ఫార్మాట్లలో సత్తా చాటగలిగే ఆటగాళ్లలో శుభ్మన్ గిల్ ఒకడు. కాబట్టి అతను కెప్టెన్గా ఎదిగేందుకు ఫ్రాంచైజీ, సపోర్ట్ స్టాఫ్ కావాల్సిన సహకారం అందించేందుకు సిద్దంగా ఉంది.
ఓ వ్యక్తిగా అతను ఎదిగితే.. ముందు ముందు గొప్ప కెప్టెన్ అవుతాడు. గుజరాత్ టైటాన్స్కు ముందు హార్దిక్ పాండ్యాకు కూడా కెప్టెన్సీ చేసిన అనుభవం లేదు. ఈ విషయాన్ని అందరూ గుర్తించుకోవాలి.

పూడ్చలేని సమస్య..
హార్దిక్ పాండ్యాను భర్తీ చేసే అనుభవాన్ని కొనలేం. మహమ్మద్ షమీ దూరమవడం కూడా మాకు ఇబ్బందే. అయితే ఈ సీజన్ మాకు ఓ గుణపాఠంగా నిలవనుంది. ప్రతీ ఏడాది జట్టులోకి కొత్త ఆటగాళ్లు వస్తూనే ఉన్నారు. జట్టును ముందుకు తీసుకెళ్తున్నారు. హార్దిక్ పాండ్యా, మహమ్మద్ షమీలు లేని లోటును పూడ్చలేం. కానీ మా జట్టులో చాలా మంది ఆటగాళ్లు ఉన్నారు.
ఉమేశ్ యాదవ్.. మళ్లీ మా ఫ్రంట్ లైన్ బౌలర్గా సేవలందించనున్నాడు. 10-12 ఏళ్ల ఐపీఎల్ అనుభవంతో జట్టు పేస్ విభాగాన్ని నడిపించనున్నాడు. ప్రతీ ఏడాది జట్టులోకి కొత్త ఆటగాళ్లు వస్తారు. వారిపై నమ్మకం ఉంచి సన్నదమవ్వడమే మన పని.'అని ఆశిష్ నెహ్రా చెప్పుకొచ్చాడు.
మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుండగా.. మార్చి 24న అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగే మ్యాచ్తో గుజరాత్ టైటాన్స్ తమ క్యాంపైన్ను ప్రారంభించనుంది.