అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు చెలరేగారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 177 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్(30 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 46), శుభ్మన్ గిల్(34 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 45) టాప్ స్కోరర్లుగా నిలవగా.. హార్దిక్ పాండ్యా(28), అభినవ్ మనోహర్(27) విలువైన పరుగులు చేశారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో సందీప్ శర్మ రెండు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ జంపా, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీసారు.
శుభారంభం లేదు..
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ వృద్దిమాన్ సాహా(4) తొలి ఓవర్లోనే క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. సాహా ఇచ్చిన హై క్యాచ్ కోసం ముగ్గురు ప్లేయర్లు పోటీపడగా.. చివరకు సంజూ శాంసన్ గ్లోవ్స్ తాకి చేజారిన బంతిని బౌల్ట్ చాకచక్యంగా అందుకున్నాడు.

ఆ తర్వాత వచ్చిన సాయిసుదర్శన్(20).. బట్లర్ సూపర్ త్రోకు రనౌటవ్వగా.. హార్దిక్ పాండ్యాతో కలిసి శుభ్మన్ గిల్ ధాటిగా ఆడాడు. దాంతో గుజరాత్ పవర్ ప్లేలో 2 వికెట్లకు 42 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం శుభ్మన్ గిల్, హార్దిక్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించే ప్రయత్నం చేయగా.. చాహల్ దెబ్బతీసాడు.
శుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీ మిస్..
జోరు మీదున్న హార్దిక్ పాండ్యా(19 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 28)ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో మూడో వికెట్కు నమోదైన 59 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్తో శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు.అయితే హాఫ్ సెంచరీకి చేరువైన అతన్ని సందీప్ శర్మ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు.
బ్యాటింగ్కు వచ్చిన అభినవ్ మనోహర్తో డేవిడ్ మిల్లర్ ఆచితూచి ఆడాడు. వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించిన మిల్లర్.. జట్టుకు భారీ స్కోర్ అందించే ప్రయత్నం చేశాడు. మరోవైపు 3 సిక్స్లతో జోరు కనబర్చిన అభినవ్ మనోహర్(27)ను ఆడమ్ జంపా ఔట్ చేయడంతో ఐదో వికెట్కు నమోదైన 45 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
చివరి ఓవర్లో రెండు బౌండరీలు బాదిన మిల్లర్.. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన రషీద్ ఖాన్ క్విక్ డబుల్ తీసే ప్రయత్నంలో రనౌటవ్వడంతో గుజరాత్ 180 పరుగుల మార్క్ను అందుకోలేకపోయింది.