ఐపీఎల్ 2025 సీజన్లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు దుమ్మురేపుతున్నారు. రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లోనూ సాయి సుదర్శన్(53 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 82) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 217 పరుగులు చేసింది. జోస్ బట్లర్(25 బంతుల్లో 5 ఫోర్లతో 36), షారూఖ్ ఖాన్(20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 36), రాహుల్ తెవాటియా(12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 24 నాటౌట్) మెరుపులు మెరిపించారు.
రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో తుషార్ దేశ్పాండే(2/53), మహీష్ తీక్షణ(2/54)రెండేసి వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్(1/30), సందీప్ శర్మ(1/41) చెరో వికెట్ పడగొట్టారు.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. జోఫ్రా ఆర్చర్ స్టన్నింగ్ డెలివరీకి శుభ్మన్ గిల్(2) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. జోస్ బట్లర్తో కలిసి సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఆచితూచి ఆడిన ఈ జోడీ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించింది. దాంతో పవర్ ప్లేలో గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది. అనంతరం మరింత దూకుడుగా ఆడిన ఈ జోడీ వేగంగా పరుగులు రాబట్టింది.
తీక్షణ బౌలింగ్లో సింగిల్ తీసి సాయి సుదర్శన్ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే ఓవర్ ఆఖరి బంతికి బట్లర్ ఎల్బీగా వెనుదిరిగాడు. దాంతో రెండో వికెట్కు నమోదైన 80 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన షారూఖ్ ఖాన్ దూకుడుగా ఆడాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. అతన్ని తీక్షణ ఔట్ చేయగా.. షెఫ్రెన్ రూథర్ఫోర్డ్(7)ను సందీప్ శర్మ పెవిలియన్ చేర్చాడు. సెంచరీ దిశగా సాగిన సాయి సుదర్శన్ను తుషార్ దేశ్పాండే కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. రషీద్ ఖాన్(12) సాయంతో రాహుల్ తేవాటియా.. జట్టు స్కోర్ను 200 ధాటించాడు.