అహ్మదాబాద్: రాజస్థాన్ రాయల్స్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ పట్టిన రిటర్న్ క్యాచ్పై ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో ట్రెంట్ బౌల్ట్ ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్లోనే ఓపెనర్ వృద్దిమాన్ సాహాను రిటర్న్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు.
అయితే ఈ క్యాచ్ కోసం ముగ్గురు ఫీల్డర్లు పోటీపడగా.. చివరకు ట్రెంట్ బౌల్ట్ అందుకోవడం చర్చనీయాంశమైంది. బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని సాహా ఓవర్ స్క్వేర్ లెగ్ దిశగా భారీ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి అక్కడే పైకి లేచింది. ఈ క్యాచ్ కోసం కీపర్ సంజూ శాంసన్, స్క్వేర్ లెగ్ ఫీల్డర్ హెట్మైర్, పాయింట్ ఫీల్డర్ ధృవ్ జురెల్ ప్రయత్నించారు. ముగ్గురు ఒకరికొకరు ఢీకొనగా బంతి సంజూ శాంసన్ గ్లోవ్స్ను తాకి గాల్లోకి లేచింది. బౌలర్ బౌల్ట్ సునాయసంగా బంతిని అందుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఈ క్యాచ్కు సంబంధించిన వీడియోను ఐపీఎల్ నిర్వాహకులు ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకోగా.. వైరల్ అయ్యింది. ఈ క్యాచ్పై స్పందించిన హర్షా భోగ్లే ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తన జీవితంలోనే ఇలాంటి రిటర్న్ క్యాచ్ను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదన్నాడు. ముగ్గురు ఫీల్డర్లు ప్రయత్నించిన క్యాచ్ను బౌల్ట్ అందుకోవడం అద్భుతమని కొనియాడాడు.
'ఇన్నేళ్లుగా చూసిన క్రికెట్లో ఇంతకంటే అసాధారణమైన రిటర్న్ క్యాచ్ను నేను ఎప్పుడూ చూడలేదు. ముగ్గురు ఫీల్డర్ ప్రయత్నించిన రీబౌండ్ క్యాచ్ను బౌల్ట్ అందుకోవడం హిల్లరీయస్'అని ట్వీట్ చేశాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 177 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్(30 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 46), శుభ్మన్ గిల్(34 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 45) టాప్ స్కోరర్లుగా నిలవగా.. హార్దిక్ పాండ్యా(28), అభినవ్ మనోహర్(27) విలువైన పరుగులు చేశారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో సందీప్ శర్మ రెండు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ జంపా, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీసారు.