
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) బ్యాటర్లు విరాట్ కోహ్లీ(53 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 58), రజత్ పటిదార్(32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 52) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దాంతో ఆర్సీబీ ప్రత్యర్థి ముందు 171 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ ఇద్దరికి తోడుగా గ్లేన్ మ్యాక్స్వెల్(18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 33) మెరుపులు మెరిపించాడు. గుజరాత్ బౌలర్లలో ప్రదీప్ సంగ్వాన్ 2 వికెట్లు తీయగా.. షమీ, అల్జారీ జోసెఫ్, రషీద్ ఖాన్, ఫెర్గూసన్ తలో వికెట్ తీసారు.
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీకి మరోసారి శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్(0) క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన యువ ప్లేయర్ రజత్ పటీదార్తో విరాట్ ఆచితూచి ఆడాడు. దాంతో పవర్ ప్లేలో ఆర్సీబీ వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. ఆ తర్వాత ఈ ఇద్దరూ జోరుగా బ్యాటింగ్ చేయడంతో పరుగులు వేగంగా వచ్చాయి. ఈ క్రమంలోనే మహమ్మద్ షమీ వేసిన 13వ ఓవర్లో క్విక్ సింగిల్ తీసిన కోహ్లీ 45 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 15 ఐపీఎల్ ఇన్నింగ్స్ల తర్వాత విరాట్ కోహ్లీకి ఇదే తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం.
ఆ వెంటనే రజత్ పటీదార్.. బౌండరీతో 29 బంతుల్లో అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. కెరీర్లో ఇదే తొలి హాఫ్ సెంచరీ అతనికి. అయితే వేగంగా ఆడే క్రమంలో రజత్ పటీదార్ క్యాచ్ ఔటవ్వడంతో రెండో వికెట్కు నమోదైన 99 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత గ్లేన్ మ్యాక్స్వెల్తో జత కలిసిన కోహ్లీ.. ధాటిగా ఆడే క్రమంలో షమీ సూపర్ యార్కర్కు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ను రషీద్ ఖాన్ ఔట్ చేశాడు. ధాటిగా ఆడిన గ్లేన్ మ్యాక్స్వెల్ను ఫెర్గూసన్ పెవిలియన్ చేర్చాడు. చివర్లో మహిపాల్ లోమ్రోర్(8 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 16) విలువైన పరుగులు చేయడంతో ఆర్సీబీ 170 పరుగుల మార్క్ను అందుకోగలిగింది.