ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 200 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్(48 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 89 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 199 పరుగులు చేసింది.
శుభ్మన్ గిల్తో పాటు సాయి సుదర్శన్(19 బంతుల్లో 6 ఫోర్లతో 33), రాహుల్ తెవాటియా(8 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 23 నాటౌట్) మెరుపులు మెరిపించారు. పంజాబ్ బౌలర్లలో కగిసో రబడా రెండు వికెట్లు తీయగా.. హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్ తలో వికెట్ తీసారు.

శుభారంభం లేకున్నా..
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. కగిసో రబడా వేసిన మూడో ఓవర్లోనే ఓపెనర్ వృద్దిమాన్ సాహా(11) క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేరాడు. క్రీజులోకి వచ్చిన కేన్ విలియమ్సన్(26)తో శుభ్మన్ గిల్ నిలకడగా బ్యాటింగ్ చేయడంతో పవర్ ప్లేలో గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది.
పవర్ ప్లే అనంతరం పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్.. హర్ప్రీత్ బ్రార్ను రంగంలోకి దింపి ఫలితాన్ని రాబట్టాడు. ఆచితూచి ఆడుతున్న కేన్ మామ(26)ను హర్ప్రీత్ బ్రార్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన సాయి సుదర్శన్.. మరో ఓపెనర్ శుభ్మన్ గిల్తో కలిసి ధాటిగా ఆడాడు.
గిల్ విధ్వంసం..
వరుస బౌండరీలతో గుజరాత్ టైటాన్స్ స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. అతని జోరుకు హర్షల్ పటేల్ కళ్లెం వేసాడు. కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో మూడో వికెట్కు నమోదైన 53 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి విజయ్ శంకర్ రాగా.. శుభ్మన్ గిల్ తన బ్యాట్కు పనిచెప్పాడు. భారీ సిక్సర్లు, బౌండరీలతో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
ఈ క్రమంలోనే శుభ్మన్ గిల్ 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. గుజరాత్ టైటాన్స్ 116.4 ఓవర్లలో 150 పరుగుల మార్క్ను అందుకుంది.భారీ షాట్ ఆడే ప్రయత్నంలో విజయ్ శంకర్(8) వెనుదిరిగినా.. శుభ్న్ గిల్ చెలరేగాడు. అతనికి రాహుల్ తెవాటియా కూడా జత కలవడంతో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ చేయగలిగింది.