
చెలరేగిన ధావన్
అనంతరం లక్ష్య చేధనకు దిగిన పంజాబ్ 16వ ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి145 పరుగులు చేసి మరో 24 బంతులు మిగిలుండగానే గెలుపొందింది. శిఖర్ ధావన్(53 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 62 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. భానుక రాజపక్స(28 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 40), లియామ్ లివింగ్ స్టోన్(10 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 30 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. గుజరాత్ బౌలర్లలో షమీ, ఫెర్గూసన్ తలో వికెట్ తీసారు.

ప్లాన్ విఫలమైనా..
144 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్కు శుభారంభం దక్కలేదు. జానీ బెయిర్ స్టోను ఓపెనర్గా ప్రమోట్ చేసినా పంజాబ్కు కలిసి రాలేదు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే జానీ బెయిర్ స్టో(1) క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన భానుక రాజపక్సతో ధావన్ ధాటిగా ఆడాడు. దాంతో పవర్ ప్లేలో పంజాబ్ వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. పవర్ ప్లే అనంతరం జోరు పెంచిన ధావన్, రాజపక్స స్కోర్ బోర్డును పరుగెత్తించారు. ముఖ్యంగా రాజపక్స భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.

లివింగ్ స్టోన్ భారీ సిక్సర్..
శిఖర్ ధావన్ కూడా ధాటిగా ఆడుతూ 38 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని ఫెర్గూసన్ విడదీసాడు. హాఫ్ సెంచరీకి చేరువైన రాజపక్సను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్కు నమోదైన 97 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన లివింగ్ స్టోన్.. మహమ్మద్ షమీ వేసిన 16వ ఓవర్లో చెలరేగాడు. 6,6,6,4,2,4 వరుస బౌండరీలతో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ ఓవర్ మొదటి బంతిని డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా లివింగ్ స్టోన్ కొట్టిన భారీ సిక్సర్గా రికార్డు నమోదు చేసింది. 117 మీటర్ల దూరం వెళ్లిన ఈ సిక్స్.. ఐపీఎల్ చరిత్రలోనే భారీ సిక్సర్గా నిలిచింది.


Click it and Unblock the Notifications
