ఐపీఎల్ 2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసింది. గుజరాత్ టైటాన్స్తో అహ్మదాబాద్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన పంజాబ్ కింగ్స్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంపాక్ట్ ప్లేయర్ విజయ్కుమార్ వైశాఖ్, అర్ష్దీప్ సింగ్ అద్భుత బౌలింగ్తో పంజాబ్ కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. శ్రేయస్ అయ్యర్(42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్లతో 97 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగగా.. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(23 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 47), శశాంక్ సింగ్(16 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 44 నాటౌట్) మెరుపులు మెరిపించారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో సాయి కిషోర్(3/30) మూడు వికెట్లు తీయగా.. కగిసో రబడా, రషీద్ ఖాన్ చెరో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 232 పరుగులు చేసి ఓటమిపాలైంది. సాయి సుదర్శన్(41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్లతో 74), జోస్ బట్లర్(33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించగా.. షెఫ్రెన్ రూథర్పోర్డ్(28 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 46) కీలక ఇన్నింగ్స్ ఆడారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ రెండు వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్, గ్లేన్ మ్యాక్స్వెల్ తలో వికెట్ తీసారు.
అదిరిపోయే ఆరంభం..
భారీ లక్ష్యచేధనలో గుజరాత్ టైటాన్స్కు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ దూకుడుగా ఇన్నింగ్స్ను ప్రారంభించారు. తొలి వికెట్కు 61 పరుగులు జోడించిన అనంతరం శుభ్మన్ గిల్(33)ను మ్యాక్స్వెల్ పెవిలియన్ చేర్చాడు. జోస్ బట్లర్తో కలిసి సాయి సుదర్శన్ చెలరేగాడు. బౌండరీల మోత మోగించాడు. ఈ క్రమంలో అతను 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం మరింత దూకుడుగా ఆడిన అతను భారీ సిక్సర్లతో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరోవైపు జోస్ బట్లర్ సైతం అదే జోరు కనబర్చడంతో గుజరాత్ స్కోర్ బోర్డు పరుగెత్తింది.
మలుపు తిప్పిన విజయ్ కుమార్..
అయితే సెంచరీ దిశగా సాగుతున్న సాయి సుదర్శన్ను అర్ష్దీప్ సింగ్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చి 84 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన షెర్ఫెన్ రూథర్ఫోర్డ్ సాయంతో జోస్ బట్లర్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతన్ని మార్కో జాన్సెన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో మూడో వికెట్కు నమోదైన 54 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన విజయ్ కుమార్ వైశాఖ్ మిడిల్ ఓవర్లలో కట్టడిగా బౌలింగ్ చేశాడు. వైడ్ యార్కర్లతో తెలివిగా బౌలింగ్ చేసిన అతను తన తొలి రెండు ఓవర్లలో ఐదేసి పరుగులు మాత్రమే ఇచ్చాడు. అతని కట్టడైన బౌలింగ్ పంజాబ్ కింగ్స్ విజయవకాశాలను మెరుగుపరిచింది. మూడో ఓవర్లో 18 పరుగులివ్వడంతో ఆఖరి ఓవర్లో గుజరాత్ విజయానికి 27 పరుగులు అవసరమయ్యాయి. దురదృష్టవశాత్తు తొలి బంతికి తెవాటియా రనౌటవ్వగా.. రెండో బంతిని రూథర్పోర్డ్ సిక్సర్తో ఆశలు రేకెత్తించాడు. కానీ అతన్ని అర్ష్దీప్ సింగ్ క్లీన్ బౌల్డ్ చేసి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. ఆఖరి బంతికి షారూఖ్ ఖాన్ భారీ సిక్సర్ బాదినా.. ఫలితం లేకపోయింది.