ఐపీఎల్ 2025 సీజన్ను పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఘనంగా ప్రారంభించారు. గుజరాత్ టైటాన్స్తో అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్లతో 97 నాటౌట్) చెలరేగాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫామ్ను కొనసాగిస్తూ.. గుజరాత్ బౌలర్లను చెడుగుడు ఆడాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 243 పరుగుల భారీ స్కోర్ చేసింది.
శ్రేయస్ అయ్యర్తో పాటు యువ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(23 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 47), శశాంక్ సింగ్(16 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 44 నాటౌట్) రాణించారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో సాయి కిషోర్(3/30) మూడు వికెట్లు తీయగా.. కగిసో రబడా, రషీద్ ఖాన్ చెరో వికెట్ తీసారు. మహమ్మద్ సిరాజ్ తేలిపోయాడు. 4 ఓవర్లు వేసి 54 పరుగులు సమర్పించుకున్నాడు.

అరంగేట్ర ప్లేయర్ విధ్వంసం..
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్కు ఆశించిన శుభారంభం దక్కలేదు. ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్(5)ను రబడా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్తో కలిసి మరో ఓపెనర్, అరంగేట్ర ప్లేయర్ ప్రియాన్ష్ ఆర్య చెలరేగాడు. అయ్యర్ కూడా బ్యాట్కు పనిచెప్పడంతో పంజాబ్ పవర్ ప్లేలోనే వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది. హాఫ్ సెంచరీకి చేరువైన ప్రియాన్ష్ ఆర్యను రషీద్ ఖాన్ పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్కు నమోదైన 51 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
శ్రేయస్ అయ్యర్ ఊచ కోత
అజ్మతుల్లా ఒమర్జాయ్, గ్లేన్ మ్యాక్స్వెల్(0) విఫలమైనా.. శ్రేయస్ అయ్యర్ దూకుడుగా ఆడాడు. 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతను అనంతరం మరింత దూకుడుగా ఆడాడు. మార్కస్ స్టోయినీస్(20), శశాంక్ సింగ్(20 నాటౌట్) సాయంతో 17.4 ఓవర్లలోనే జట్టు స్కోర్ను 200 ధాటించాడు. సెంచరీ చేసే అవకాశం ఉన్నా.. జట్టు కోసం ఆలోచించిన అయ్యర్.. భారీ షాట్లు ఆడుతున్న శశాంక్ సింగ్ స్ట్రైక్ ఇచ్చాడు. అతను సిరాజ్ వేసిన ఆఖరి ఓవర్లో ఐదు బౌండరీలతో 23 పరుగులు పిండుకున్నాడు. దాంతో పంజాబ్ 243 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది.