GT vs PBKS: శ్రేయస్ అయ్యర్ సూచనల మేరకే తాను అతనికి స్ట్రైక్ ఇవ్వలేదని పంజాబ్ కింగ్స్ పవర్ హిట్టర్ శశాంక్ సింగ్ తెలిపాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో శశాంక్ సింగ్(16 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 44 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. గత సీజన్ ఫామ్ను కొనసాగిస్తూ.. బౌండరీల మోత మోగించాడు. మరోవైపు శ్రేయస్ అయ్యర్(42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్లతో 97 నాటౌట్) సైతం విధ్వంసకర బ్యాటింగ్తో భారీ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.
ఆఖరి ఓవర్కు ముందే 97 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. శశాంక్ సింగ్ స్ట్రైక్ ఇవ్వకపోవడంతో మూడెంకల స్కోర్ అందుకోలేకపోయాడు. చివరి ఓవర్లో శశాంక్ సింగ్ ఐదు బౌండరీలు బాది 23 పరుగులు రాబట్టాడు. దాంతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 243 పరుగుల భారీ స్కోర్ చేసింది.

పంజాబ్ ఇన్నింగ్స్ అనంతరం అధికారిక బ్రాడ్కాస్టర్తో మాట్లాడిన శశాంక్ సింగ్.. శ్రేయస్ అయ్యర్ సెంచరీకి సహాకరించకపోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు. శ్రేయస్ అయ్యరే.. తన సెంచరీ కోసం కాకుండా స్వేచ్చగా షాట్స్ ఆడాలని చెప్పాడు. దాంతోనే తాను స్ట్రైక్ ఇవ్వలేదన్నాడు. 'శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ అద్భుతం. డగౌట్ నుంచి అతని బ్యాటింగ్ చూడ ముచ్చటగా అనిపించింది. నేను బ్యాటింగ్కు రాగానే.. శ్రేయస్ అయ్యర్ నాకు ఒక్కటే చెప్పాడు.
తొలి బంతి నుంచి హిట్ చేయాలన్నాడు. తన సెంచరీ కోసం చూడకుండా స్వేచ్చగా షాట్స్ ఆడాలని సూచించాడు. సెంచరీ కంటే టీమ్ స్కోర్ ముఖ్యమని తెలిపాడు. దాంతో నేను బౌండరీలు కొట్టేందుకు ప్రయత్నించాను. నేను స్వేచ్చగా నా షాట్స్ ఆడేలా టీమ్మేనేజ్మెంట్ నాకు అండగా నిలిచింది. ఏ షాట్స్ ఆడాలనేది నాకు తెలుసు. నా బలాలకు తగ్గట్లుగానే నేను షాట్స్ ఆడుతాను.'అని శశాంక్ సింగ్ చెప్పుకొచ్చాడు.