
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లోకి లేట్గా ఎంట్రీ ఇచ్చిన పంజాబ్ కింగ్స్ ప్లేయర్ రిషి ధావన్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ముక్క సర్జరీ అయిన నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ప్రొటెక్షన్ మాస్క్ ధరించి బౌలింగ్ చేసిన రిషి ధావన్.. అందరి దృష్టిని ఆకర్షించాడు. 6 ఏళ్ల తర్వాత వచ్చిన అవకాశాన్ని రెండు చేతుల అందిపుచ్చుకున్నాడు. సూపర్ బౌలింగ్తో జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. అదే జోరులో గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో కళ్లు చెదిరే ఫీల్డింగ్తో ఆకట్టుకున్నాడు.
బుల్లెట్ త్రోతో నేరుగా వికెట్లను కొట్టి పంజాబ్ కింగ్స్కు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. అతని సూపర్ ఫీల్డింగ్కు గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభమ్న్ గిల్(9) నిరాశగా పెవిలియన్ చేరాడు. గుజరాత్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సందీప్ శర్మ వేసిన ఆ ఓవర్ తొలి బంతిని కవర్స్ దిశగా ఆడిన గిల్ క్విక్ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. ఆ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న రిషి ధావన్ అద్భుతంగా బంతిని అందుకున్న సింగిల్ వికెట్గా కనిపిస్తున్న స్టంప్ను బుల్లెట్ త్రోతో పడగొట్టాడు. క్రీజుకు చాలా దూరంలో నిలిచిపోయిన శుభ్మన్ మూల్యం చెల్లించుకున్నాడు.
అయితే అతను పరుగెత్తే క్రమంలో బౌలర్ సందీప్ శర్మ అతనికి అడ్డుగా వచ్చాడు. దాంతో అతన్ని ధాటి రావడానికి గిల్కు కొంత సమయం పట్టింది. ఔటైన వెంటనే సందీప్ శర్మపై గిల్ అసహనం వ్యక్తం చేశాడు. అయితే ఇక్కడ సందీప్ శర్మ తప్పు కూడా ఏం లేదు. బౌలింగ్ చేసి అతని అక్కడే నిల్చున్నాడు. శుభ్మన్ గిలే అనవసర పరుగుకు ప్రయత్నించి వికెట్ ఇచ్చుకున్నాడు.
ఇక రిషి ధావన్ బుల్లెట్ త్రోపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బుల్లెట్ త్రో అంటూ కొనియాడుతున్నారు. ఈ వికెట్కు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తున్నారు. ఇక పవర్ ప్లే ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ 2 వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. ధాటిగా ఆడిన సాహా(21) రబడా ఔట్ చేశాడు.