ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో 450 మ్యాచ్ల మైలురాయి అందుకున్న తొలి భారత ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో శనివారం జరిగిన మ్యాచ్తో రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించాడు. అయితే ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ తీవ్రంగా నిరాశపరిచాడు. మహహ్మద్ సిరాజ్ బౌలింగ్లో వరుసగా రెండు బౌండరీలు బాదిన రోహిత్.. ఆ మరుసటి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సిరాజ్ వేసిన స్క్రాంబుల్డ్ డెలివరీని అంచనా వేయడంలో రోహిత్ విఫలమై మూల్యం చెల్లించుకున్నాడు.
ఈ మ్యాచ్లో నిరాశపర్చినా రోహిత్.. అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 2007 ఏప్రిల్లో ముంబై జట్టు తరఫున బరోడాతో రోహిత్ తన టీ20 క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించాడు. అరంగేట్ర టీ20 ప్రపంచకప్ 2007 నుంచి ప్రతీ టీ20 వరల్డ్ కప్ ఆడాడు. రెండు టీ20 ప్రపంచకప్లు గెలిచిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. ధోనీ సారథ్యంలో 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న రోహిత్.. 2024లో కెప్టెన్గా మరో టైటిల్ అందుకున్నాడు.

టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం రోహిత్ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు. భారత్ తరఫున అత్యధిక టీ20లు ఆడిన జాబితాలో రోహిత్ శర్మ తర్వాత దినేశ్ కార్తీక్(412), విరాట్ కోహ్లీ(401), మహేంద్ర సింగ్ ధోనీ(393), సురేశ్ రైనా(336) ఉన్నారు. దినేశ్ కార్తీక్ ఇప్పటికే తన కెరీర్కు వీడ్కోలు పలికాడు. విదేశాల్లో జరిగే ఫ్రాంచైజీ క్రికెట్ ఆడుతున్నాడు. సౌతాఫ్రికా 20 లీగ్లో పార్ల్ రాయల్స్కు ఆడాడు. ఈ సీజన్లోనే ధోనీ 400 టీ20 మ్యాచ్ల మైలురాయి అందుకోనున్నాడు.