ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బౌలర్లు సమష్టిగా చెలరేగారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్..నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 196 పరుగులు చేసింది. సాయి సుదర్శన్(41 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 63) హాఫ్ సెంచరీతో రాణించగా.. శుభ్మన్ గిల్(27 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 38), జోస్ బట్లర్(24 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 39) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా(2/29) రెండు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ ఉర్ రెహ్మా న్, సత్యనారయణ రాజు తలో వికెట్ తీసారు.

చెలరేగిన గిల్, సాయి..
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్కు ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ ఆశించిన శుభారంభాన్ని అందించారు. ఆచితూచి ఆడిన ఈ జోడీ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించింది. ముజీబ్ ఉర్ రెహ్మాన్ వేసిన ఐదో ఓవర్లో సాయి సుదర్శన్ వరుసగా 4, 6 బాదగా.. గిల్ ఓ ఫోర్ కొట్టాడు. చాహర్ వేసిన మరుసటి ఓవర్లో గిల్.. బౌలర్ తలపై నుంచి భారీ సిక్సర్ బాదగా.. ఓవర్ త్రో రూపంలో అప్పనంగా గుజరాత్కు ఐదు పరుగులు వచ్చాయి. ఆఖరి బంతిని గిల్ బౌండరీ బాదడంతో ఈ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. దాంతో పవర్ ప్లేలో గుజరాత్ వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది.
మలుపు తిప్పిన హార్దిక్ పాండ్యా..
అనంతరం రెండు ఓవర్లలో బౌండరీ రాలేదు. దాంతో ఒత్తిడికి గురైన గిల్.. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 78 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన బట్లర్ వచ్చి రావడంతోనే సాంట్నర్ బౌలింగ్లో సిక్సర్, ఫోర్ బాది జోరు కనబర్చాడు. నిలకడగా ఆడిన ఈ జోడీ 30 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకుంది. హాఫ్ సెంచరీ దిశగా సాగిన బట్లర్(39)ను ముజీబ్ ఉర్ రెహ్మాన్ క్యాచ్ ఔట్ చేశాడు. బౌల్ట్ బౌలింగ్లో సింగిల్ తీసి సాయి సుదర్శన్ 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హార్దిక్ బౌలింగ్లో భారీ సిక్సర్ బాదిన షారూఖ్ ఖాన్.. మరుసటి బంతికే క్యాచ్ ఔటయ్యాడు.
ఆఖర్లో చెలరేగిన ముంబై పేసర్లు..
క్రీజులోకి వచ్చిన రూథర్ ఫోర్డ్.. తెలుగు తేజం, యువ పేసర్ సత్యనారయణ రాజు బౌలింగ్లో సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. రెండు సిక్సర్లతో 19 పరుగులు పిండుకున్నాడు. బౌల్ట్ వేసిన 18వ ఓవర్లో తొలి బంతిని రూథర్ ఫోర్డ్ సిక్సర్ బాదగా.. ఐదో బంతికి సాయి సుదర్శన్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దీపక్ చాహర్ వేసిన మరుసటి ఓవర్లో తొలి బంతికి నాన్స్ట్రైకర్గా ఉన్న రాహుల్ తెవాటియా(0) డైమండ్ డక్గా వెనుదిరగ్గా.. మరుసటి బంతికే రూథర్ ఫోర్డ్(18) క్యాచ్ ఔటయ్యాడు. సత్య నారయణ వేసిన ఆఖరి ఓవర్లో రషీద్ సిక్స్ బాది ఔటయ్యాడు. సత్యనారయణకు ఇదే తొలి ఐపీఎల్ వికెట్ కావడం గమనార్హం.