టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు స్టార్ పేసర్, హైదరాబాద్ డీఎస్పీ మహమ్మద్ సిరాజ్ తన బౌలింగ్ పదును చూపించాడు. స్టన్నింగ్ డెలివరీతో హిట్మ్యాన్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. సిరాజ్ బౌలింగ్ నైపుణ్యానికి రోహిత్ శర్మ బిత్తరపోయాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న సిరాజ్.. తొలి ఓవర్లోనే రోహిత్ శర్మ(8)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు బాదిన రోహిత్.. మరుసటి బంతికే ఔటయ్యాడు. ఈ ఓవర్ నాలుగో బంతిని సిరాజ్ ఔట్ స్క్రాంబుల్డ్ డెలివరీగా వేయగా.. బంతి నేరుగా వెళ్లి స్టంప్స్ను లేపేసింది. దాంతో రోహిత్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఈ వికెట్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.

సిరాజ్పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. రోహిత్ శర్మకు సిరాజ్ తన బౌలింగ్ పదును చూపించాడని కామెంట్ చేస్తున్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి మహమ్మద్ సిరాజ్ను ఎంపిక చేయని విషయం తెలిసిందే. సిరాజ్ డెత్ ఓవర్లలో అంతగా ప్రభావం చూపలేడని అప్పట్లో టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మ వివరణ ఇచ్చాడు. అతని స్థానంలో అర్ష్దీప్ సింగ్కు అవకాశం ఇచ్చారు.
అయితే అతనికి కూడా ఒక్క మ్యాచ్లోనూ తుది జట్టులో చోటు దక్కలేదు. నలుగురు స్పిన్నర్లతో దిగిన టీమిండియా విశ్వ విజేతగా నిలిచింది. సిరాజ్ సైతం.. స్పిన్నర్ల ప్రభావం ఎక్కువగా ఉండటంతోనే తనకు ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో అవకాశం దక్కలేదని తెలిపాడు. తాజా ఘటనతో ఫ్యాన్స్ మాత్రం.. సిరాజ్ తన బౌలింగ్ నైపుణ్యాన్ని రోహిత్ శర్మకు తెలియజేశాడని కామెంట్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్..నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 196 పరుగులు చేసింది. సాయి సుదర్శన్(41 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 63) హాఫ్ సెంచరీతో రాణించగా.. శుభ్మన్ గిల్(27 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 38), జోస్ బట్లర్(24 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 39) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా(2/29) రెండు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ ఉర్ రెహ్మా న్, సత్యనారయణ రాజు తలో వికెట్ తీసారు.