ఐపీఎల్ 2024 సీజన్లోనూ ముంబై ఇండియన్స్ ఓటమితోనే ప్రారంభించింది. గత 12 ఏళ్లుగా ఆ జట్టు తొలి మ్యాచ్ గండాన్ని గట్టెక్కలేకపోతుంది. గుజరాత్ టైటాన్స్తో ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో పేలవ బ్యాటింగ్తో 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు చేసింది. సాయి సుదర్శన్(39 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 45), శుభ్మన్ గిల్(22 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 31) టాప్ స్కోరర్లుగా నిలవగా.. చివర్లో రాహుల్ తెవాటియా(15 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 22) మెరుపులు మెరిపించాడు.

ముంబై బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు తీయగా.. గెరాల్డ్ కోయిట్జీ రెండు వికెట్లు పడగొట్టాడు. పియూష్ చావ్లాకు ఓ వికెట్ దక్కింది.
అనంతరం లక్ష్యం చేధనకు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 162 పరుగులు చేసి ఓటమిపాలైంది. రోహిత్ శర్మ(29 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 43), డెవాల్డ్ బ్రెవాస్(38 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 46) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
గుజరాత్ బౌలర్లలో ఒమర్జాయ్, స్పెన్సర్ జాన్సన్, మోహిత్ శర్మ, ఉమేశ్ యాదవ్ రెండేసి వికెట్లు తీయగా.. సాయి కిషోర్ ఓ వికెట్ పడగొట్టాడు. 2013 నుంచి తాజా సీజన్ వరకు ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్లో విజయం సాధించలేదు.
ఆదిలోనే బిగ్ షాక్..
169 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఒక్క పరుగు కూడా చేయకుండానే ఓపెనర్ ఇషాన్ కిషన్(0) వికెట్ కోల్పోయింది. అజ్మతుల్లా ఒమర్జాయ్ వేసిన తొలి ఓవర్లోనే అతను కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన నమన్ ధిర్(20) వరుస బౌండరీలతో దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు.
కానీ అతని జోరుకు ఒమర్జాయ్ తన మరుసటి ఓవర్లో బ్రేక్ వేసాడు. వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. డెవాల్డ్ బ్రేవిస్తో కలిసి రోహిత్ శర్మ ధాటిగా ఆడటంతో పవర్ ప్లేలో ముంబై 2 వికెట్లు 52 పరుగులు చేసింది. 70 పరుగులతో క్రీజులో సెట్ అయిన ఈ జోడీని సాయి కిషోర్ విడదీసాడు.
స్టన్నింగ్ డెలివరీతో రోహిత్ శర్మను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. రోహిత్ ఔటైనా.. తనదైన శైలిలో బ్యాటింగ్ చేసిన డెవాల్డ్ బ్రెవిస్(46) మోహిత్ శర్మ బౌలింగ్లో రిటర్న్ క్యాచ్గా వెనుదిరిగాడు. క్రీజులోకి తిలక్ వర్మ రాగా.. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.
మలుపు తిప్పిన జాన్సన్..
18వ ఓవర్లో మోహిత్ శర్మ ఓ వికెట్ తీయడంతో ముంబై విజయానికి చివరి 12 బంతుల్లో 27 పరుగులు అవసరమయ్యాయి. స్పెన్సర్ జాన్సన్ వేసిన 19వ ఓవర్లో సిక్స్ బాదిన తిలక్ వర్మ(25).. మరుసటి బంతికే క్యాచ్ ఔటయ్యాడు. మిగిలిన నాలుగు బంతుల్లో 2 పరుగులే ఇచ్చిన జాన్సన్.. ఆఖరి బంతికి కోయిట్జీ(1)ని ఔట్ చేశాడు.
దాంతో ఆఖరి ఓవర్లో ముంబై విజయానికి 19 పరుగులు అవసరమయ్యాయి. ఉమేశ్ యాదవ్ వేసిన ఆఖరి ఓవర్లో హార్దిక్ పాండ్యా వరుసగా 6, 4 కొట్టి ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన పియూష్ చావ్లా కూడా భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔట్ అవ్వడంతో గుజరాత్ విజయం లాంఛనమైంది.