ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఘోర అవమానం ఎదురైంది. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ జరుగుతున్న మ్యాచ్లో హార్దిక్ పాండ్యాను అభిమానులు ఎగతాళి చేశారు. టాస్ సందర్భంగా అటు రోహిత్ ఫ్యాన్స్.. ఇటు గుజరాత్ టైటాన్స్ అభిమానులు గట్టిగా అరుస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.
హార్దిక్ పాండ్యా టాస్ గెలవగానే రోహిత్ శర్మ అంటూ గట్టిగా అరిచారు. గతేడాది వరకు గుజరాత్ టైటాన్స్కు సారథిగా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా.. ఈ సీజన్ మినీ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చాడు. క్యాష్ ట్రేడ్ డీలింగ్ ద్వారా అతన్ని ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. జట్టులోకి తీసుకున్న వెంటనే కెప్టెన్గా ప్రకటించింది.

ఈ నిర్ణయాన్ని రోహిత్ శర్మ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు ఇవ్వడాన్ని తప్పుబడుతున్నారు. హార్దిక్ పాండ్యా, ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇక తొలి మ్యాచ్కు హాజరైన అభిమానులు.. హార్దిక్ను టార్గెట్ చేస్తూ అతన్ని ఎగతాళి చేశారు.
సొంత రాష్ట్రానికి చెందిన గుజరాత్ టైటాన్స్ను కాదని ముంబై ఇండియన్స్కు వెళ్లడాన్ని ఆ రాష్ట్ర అభిమానులు సహించలేకపోతున్నారు. వారు కూడా హార్దిక్ పాండ్యాపై అసహనం వ్యక్తం చేశారు. చీటర్ అంటూ ప్లకార్డ్స్ ప్రదర్శించారు. ఈ వ్యవహారంపై టాస్ సందర్భంగా హార్దిక్ పాండ్యా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
గుజరాత్ టైటాన్స్ తన పుట్టిన రాష్ట్రమని, ఈ స్టేట్ తరఫున ఎంతో సక్సెస్ సాధించానని, ఇక్కడి ప్రేక్షకుల అభిమానం ప్రత్యేకమని తెలిపాడు. కానీ క్రికెటర్గా తనకు అవకాశం ఇచ్చిన ప్రదేశం మాత్రం ముంబై అని, ఆ జట్టులోకి తిరిగి రావడం సంతోషంగా ఉందని చెప్పాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది.
పిచ్ కండిషన్స్, డ్యూ వచ్చే అవకాశం ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని హార్దిక్ తెలిపాడు. నలుగురు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లు, ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్ల కాంబినేషన్తో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు.