అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బౌలర్లు మరోసారి విఫలమయ్యారు. ముఖ్యంగా తమ డెత్ బౌలింగ్ బలహీనతను బయటపెట్టుకున్నారు. దాంతో గుజరాత్ లోయరార్డర్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 207 పరుగులు చేసింది.
శుభ్మన్ గిల్(34 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 56) హాఫ్ సెంచరీతో రాణించగా.. డేవిడ్ మిల్లర్(22 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 46), అభినవ్ మనోహర్(21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 42), రాహుల్ తేవాడియా(5 బంతుల్లో 3 సిక్సర్లతో 20 నాటౌట్) మెరుపులు మెరిపించారు. ముంబై బౌలర్లలో పియూష్ చావ్లా రెండు వికెట్లు తీయగా.. అర్జున్ టెండూల్కర్, జాసన్ బెహ్రాండార్ఫ్, రిలే మెరిడిత్, కుమార్ కార్తీకేయ తలో వికెట్ తీసారు.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్కు అర్జున్ టెండూల్కర్ గట్టి షాకిచ్చాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే ఓపెనర్ వృద్దిమాన్ సాహా(4)ను కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. దాంతోక్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యాతో శుభ్మన్ గిల్ ధాటిగా ఆడాడు. కామెరూన్ గ్రీన్ వేసిన 6వ ఓవర్లో రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాదడంతో గుజరాత్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది.
ఆ వెంటనే రోహిత్ శర్మ.. స్పిన్నర్ పియూష్ చావ్లాను రంగంలోకి దింపగా.. తొలి బంతికే హార్దిక్ పాండ్యా(13) క్యాచ్ ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన విజయ్ శంకర్తో శుభ్మన్ గిల్ ఆచితూచి ఆడాడు. ఇక కార్తీకేయ వేసిన 10వ ఓవర్లో శంకర్ వరుసగా 4, 6 బాదగా.. శుభ్మన్ గిల్ బౌండరీతో పాటు క్విక్ సింగిల్ తీసి 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
క్రీజలో సెట్ అవుతున్న ఈ జోడీని కార్తీకేయ విడదీసాడు. శుభ్మన్ గిల్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చి రెండో వికెట్కు నమోదైన 41 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. ఆ వెంటనే విజయ్ శంకర్(19)ను చావ్లా ఔట్ చేయగా.. క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించారు.
చావ్లా వేసిన 15వ ఓవర్లో అభినవ్ మనోహర్ రెండు బౌండరీలతో పాటు ఓ భారీ సిక్సర్ బాది 17 పరుగులు పిండుకున్నాడు. గ్రీన్ వేసిన 18వ ఓవర్లో అభినవ్.. మరో 2 సిక్స్లు బాదగా.. మిల్లర్ కూడా ఓ భారీ సిక్సర్ కొట్టడంతో 22 పరుగులు వచ్చాయి. మెరిడిత్ వేసిన 19వ ఓవర్లో అభినవ్ మనోహర్ క్యాచ్ ఔటవ్వగా.. క్రీజులోకి వచ్చిన రాహుల్ తెవాటియా వచ్చి రావడంతోనే ట్రేడ్ మార్క్ షాట్తో సిక్సర్ బాదాడు.
మిల్లర్ కూడా రెండు సిక్స్లు బాదడంతో 19 పరుగులు వచ్చాయి. బెహ్రాన్ డార్ఫ్ వేసిన ఆఖరి ఓవర్లో రాహుల్ తేవాటియా రెండు సిక్స్లు బాదగా.. మిల్లర్ ఔటయ్యాడు. రషీద్ ఖాన్ క్విక్ డబుల్ తీయడంతో గుజరాత్ 207 పరుగుల భారీ స్కోర్ చేసింది.