
ముంబై: సునాయసంగా గెలిచే మ్యాచ్ను చేజేతులా చేజార్చుకున్నామని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. రెండు రనౌట్లు తమ ఓటమిని శాసించాయని తెలిపాడు. ముంబై ఇండియన్స్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో చివరి నిమిషంలో తడబడిన గుజరాత్ 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆఖరి ఓవర్లో 9 పరుగులు చేయలేక చేతులెత్తేసింది. ఈ ఓటమి అనంతరం మాట్లాడిన హార్దిక్ పాండ్యా ఓటమికి గల కారణాలను తెలియజేశాడు. టీ20 క్రికెట్లో వెను వెంటనే వికెట్లు కోల్పోతే జట్టును ఒత్తిడికి గురిచేస్తోందని తెలిపాడు.
'చివరి ఓవర్లో 9 పరుగులు చేయడం మాకు ఏ రోజైన పెద్ద కష్టం కాదు. కానీ రెండు రనౌట్లు మమ్మల్ని దెబ్బతీసాయి. టీ20 క్రికెట్లో వరుసగా వికెట్లు కోల్పోవద్దు. వరుసగా ఔటైతే జట్టుకు కోలుకోలేని దెబ్బపడుతోంది. ఈ మ్యాచ్లో మాకు అదే పరిస్థితి ఎదురైంది. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్ను చేజేతులా చేజార్చుకున్నాం. 19.2 ఓవర్ల వరకు మేం మంచి క్రికెట్ ఆడాం. కానీ నేను ముందుగా చెప్పినట్లు వరుసగా వికెట్లు కోల్పోతే ఏం చేయలేం. అయితే ముంబై ఆరంభం చూసాక ఆ జట్టు 200 ప్లస్ పరుగులు చేస్తదని అనుకున్నా. కానీ మా బౌలర్లు అద్భుతంగా రాణించి కట్టడి చేశారు'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(28 బంతుల్లో5 ఫోర్లు, 2 సిక్స్లతో 43), ఇషాన్ కిషన్(29 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 45), టీమ్ డేవిడ్ (21 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 44 నాటౌట్) రాణించారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీయగా.. అల్జారీ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్, ప్రదీప్ సంగ్వాన్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 173 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. వృద్దిమాన్ సాహా(40 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 55), శుభ్మన్ గిల్(36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు. ముంబై బౌలర్లలో మురుగన్ అశ్విన్ రెండు వికెట్లు తీయగా.. పొలార్డ్ ఓ వికెట్ పడగొట్టాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా రనౌట్ మ్యాచ్ను ములపుతిప్పింది.