అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. గుజరాత్ టైటాన్స్ వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా ప్యాంట్ తిర్రమర్ర వేసుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. మైదానంలోకి త్వరగా రావాలనే ఆతృతలో సాహా ప్యాంట్ను సరిగ్గా వేసుకోలేదు. ప్యాంట్ తిర్రమర్ర వేసుకోవడంతో ముందుకు ఉండాల్సిన బ్రాండ్ ప్రమోషన్ పేర్లు వెనుకాల కనిపించాయి.
దాంతో మైదానంలో నవ్వులు విరబూసాయి. ఇది గమనించిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పగలబడి నవ్వాడు. అతనితో పాటు మహమ్మద్ షమీ, క్వింటన్ డికాక్ కూడా నవ్వు ఆపుకోలేకపోయారు. వికెట్ కీపర్ కావడంతో బయటకు వెళ్లలేకపోయిన సాహా.. 2 ఓవర్ల అనంతరం మైదానం వీడియా ప్యాంట్ను సరిగ్గా వేసుకున్నాడు. మ్యాచ్ అనంతరం ఈ ఘటనపై ఆరాతీయగా.. అందుకు గల కారణాన్ని సాహా వెల్లడించాడు.

'మ్యాచ్ ముగిసిన తర్వాత ఫిజియో వచ్చి.. నీకు రెండో ఇన్నింగ్స్లో రెస్ట్ ఇస్తామని చెప్పాడు. దాంతో నేను తాపీగా ప్లేట్లో భోజనం పెట్టుకుని తింటున్నా. సడన్గా వచ్చి అంపైర్లు ఒప్పుకోలేదు. వికెట్ కీపింగ్ చేయాలని చెప్పారు. దాంతో టైమ్ అయిపోయిందనే తొందరలో ప్యాంట్ తిర్రమర్ర వేసుకున్నా. రెండు ఓవర్ల తర్వాత బ్రేక్ టైమ్లో బయటకు వెళ్లి మార్చుకున్నాను. ఆ సమయంలో కేఎస్ భరత్ అద్భుతంగా కీపింగ్ చేశాడు.'అని సాహా చెప్పుకొచ్చాడు.
నిబంధనల ప్రకారం సబ్స్టిట్యూట్ ఫీల్డర్ను అనుమతించాలంటే కనీసం రెండు ఓవర్లు ఫీల్డ్ చేయాలి. గాయాలైనప్పుడు మాత్రం అంపైర్ అనుమతితో నేరుగా బరిలోకి దిగవచ్చు.
ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 56 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 227 పరుగులు చేసింది. వృద్దిమాన్ సాహా(43 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్లతో 81), శుభ్మన్ గిల్(51 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్లతో 94 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. లక్నో బౌలర్లలో మోహ్సిన్ ఖాన్, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్(41 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 70), కైల్ మేయర్స్(32 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 48) రాణించినా ఫలితం లేకపోయింది. మోహిత్ శర్మ(4/29) నాలుగు వికెట్లతో లక్నో పతనాన్ని శాసించాడు. మహమ్మద్ షమీ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీసారు.