ఐపీఎల్ 2025 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ జోరు కొసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్లోనూ ఆ జట్టు విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్తో శనివారం జరిగిన తొలి మ్యాచ్లో సమష్టిగా రాణించిన లక్నో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో మహమ్మద్ సిరాజ్(0/50) పేలవ బౌలింగ్తో పాటు మిడిలార్డర్ బ్యాటింగ్ వైఫల్యం గుజరాత్ టైటాన్స్ పతనాన్ని శాసించింది. దాంతో నాలుగు వరుస విజయాల తర్వాత గుజరాత్ టైటాన్స్ ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 180 పరుగులు చేసింది. సాయి సుదర్వన్ (37 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 56), శుభ్మన్ గిల్(38 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 60)హాఫ్ సెంచరీలతో రాణించారు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్(2/34), రవి బిష్ణోయ్(2/36) రెండేసి వికెట్లు పడగొట్టారు. దిగ్వేష్ రతి, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ 19.3 ఓవర్లలో 4 వికెట్లకు 186 పరుగులు చేసి గెలుపొందింది. నికోలస్ పూరన్(34 బంతుల్లో ఫోర్, 7 సిక్స్లతో 61), ఎయిడెన్ మార్క్రమ్(31 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్తో 58) హాఫ్ సెంచరీలతో రాణించారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ(2/26) రెండు వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు.
మార్క్రమ్, పూరన్ విధ్వంసం..
లక్ష్యచేధనలో లక్నో సూపర్ జెయింట్స్కు శుభారంభం దక్కింది. ఓపెనర్ ఎయిడెన్ మార్క్రమ్, రిషభ్ పంత్(21) లక్నో ఇన్నింగ్స్ను దూకుడుగా ప్రారంభించారు. బౌండరీలతో గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా సిరాజ్ బౌలింగ్ను చితక్కొట్టారు. సిరాజ్ వేసిన తొలి ఓవర్లో రిషభ్ పంత్ ఇచ్చిన క్యాచ్ను జోస్ బట్లర్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో అతను చెలరేగాడు. దాంతో పవర్ ప్లేలో లక్నో వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని ప్రసిధ్ కృష్ణ విడదీసాడు. రిషభ్ పంత్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ తనదైన బ్యాటింగ్తో చెలరేగాడు. భారీ సిక్సర్లతో గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
ఉత్కంఠగా మారినా..
సాయి కిషోర్ బౌలింగ్లో బౌండరీతో పాటు సింగిల్ తీసి మార్క్రమ్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు నికోలస్ పూరన్ వరుసగా సిక్స్లు బాదాడు. మార్క్రమ్ను ప్రసిధ్ కృష్ణ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్కు నమోదైన 58 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మార్క్రమ్ వెనుదిరిగినా పూరన్ తన జోరును కొనసాగించాడు. సిరాజ్ బౌలింగ్లో బౌండరీ బాది 22 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దూకుడుగా ఆడుతున్న పూరన్ను రషీద్ ఖాన్ పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన మిల్లర్, బదోని బౌండరీలు బాదేందుకు ఇబ్బంది పడటంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. సుందర్ బౌలింగ్లో మిల్లర్ రనౌటయ్యే అవకాశాన్ని జోస్ బట్లర్ చేజార్చాడు. 19వ ఓవర్లో మిల్లర్ను ఔట్ చేసిన సుందర్ 3 పరుగులే ఇచ్చాడు. దాంతో ఆఖరి ఓవర్లో లక్నో విజయానికి 6 పరుగులు అవసరమయ్యాయి. సాయి కిషోర్ బౌలింగ్లో బదోని 4, 6 బాది విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.
చెలరేగిన గిల్, సాయి..
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్కు ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తమదైన క్లాస్ బ్యాటింగ్తో పరుగులు రాబట్టారు. దాంతో పవర్ ప్లేలో గుజరాత్ వికెట్ నష్టపోకుండా 54 పరుగులు చేసింది. పవర్ ప్లే అనంతరం దూకుడుగా ఆడిన ఈ జోడీ.. లక్నో బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. రవి బిష్ణోయ్, మార్క్రమ్ల బౌలింగ్ను చితక్కొట్టింది. దిగ్వేష్ రతీ కాస్త కట్టుదిట్టంగా వేసాడు. అతని బౌలింగ్లోనే క్విక్ సింగిల్ తీసి గిల్ 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దిగ్వేష్ రతీ వేసిన మరుసటి ఓవర్లో సాయి సుదర్శన్ ఇచ్చిన క్యాచ్ను అబ్దుల్ సమద్ నేలపాలు చేశాడు.
తడబడ్డ మిడిలార్డర్..
అదే ఓవర్ ఆఖరి బంతిని స్వీప్ షాట్తో షార్ట్ఫైన్ లెగ్ దిశగా బౌండరీ తరలించిన సాయి 32 బంతుల్లో అర్థ శతకాన్ని అందుకున్నాడు. సాయి సుదర్శన్కు ఇది 10వ ఐపీఎల్ హాఫ్ సెంచరీ. ఈ సీజన్లో మూడోది. 120 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని ఆవేశ్ ఖాన్ విడదీసాడు. క్యాచ్ ఔట్గా శుభ్మన్ గిల్ను పెవిలియన్ చేర్చాడు. రవి బిష్ణోయ్ వేసిన మరుసటి ఓవర్లో సాయి సుదర్శన్ కూడా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన వాషింగ్టన్ సుందర్(2), జోస్ బట్లర్(16), రాహుల్ తెవాటియా(0) నిరాశపర్చగా.. షెఫ్రెన్ రూథర్ఫోర్డ్(22)తీవ్రంగా తడబడ్డాడు. దాంతో 200 పరుగులు చేస్తుందనుకున్న గుజరాత్ 180 పరుగులకే పరిమితమైంది.
అగ్రస్థానం గల్లంతు..
ఈ ఓటమితో గుజరాత్ టైటాన్స్ తన అగ్రస్థానాన్ని కోల్పోయింది. 6 మ్యాచ్ల్లో 4 విజయాలు 2 ఓటములతో రెండో స్థానానికి పడిపోయింది. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ 6 మ్యాచ్లు.. 4 విజయాలు, 2 ఓటములతో మూడో స్థానానికి చేరింది. ఢిల్లీ క్యాపిటల్స్ 4 మ్యాచ్లకు 4 గెలిచి అగ్రస్థానంలో కొనసాగుతోంది. కేకేఆర్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో కొనసాగుతున్నాయి. సన్రైజర్స్ హైదరాబాద్ ఆఖరి స్థానంలో కొనసాగుతోంది.