అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ సంచలన విజయాన్నందుకుంది. గుజరాత్ టైటాన్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో యువ బ్యాటర్ రింకూ సింగ్(21 బంతుల్లో ఫోర్, 6 సిక్స్లతో 48 నాటౌట్) అసాధారణ ప్రదర్శనతో 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. చివరి ఓవర్లో కేకేఆర్ విజయానికి 29 పరుగులు కావాల్సిన సమయంలో రింకూ సింగ్.. వరుసగా ఐదు సిక్స్లు బాది చారిత్రాత్మక విజయాన్నందించాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 204 పరుగులు చేసింది. విజయ్ శంకర్(24 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 63), సాయి సుదర్శన్(38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 53) హాఫ్ సెంచరీలతో రాణించారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ మూడు వికెట్లు తీయగా.. సుయాశ్ శర్మ ఓ వికెట్ పడగొట్టాడు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 207 పరుగులు చేసింది. రింకూ సింగ్తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్(40 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్లతో 83), నితీశ్ రాణా(29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 45) రాణించారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ మూడు వికెట్లు తీయగా.. అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ షమీ, జోష్ లిటిల్కు ఓ వికెట్ దక్కింది.
భారీ లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్కు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఓపెనర్లు రెహ్మానుల్లా గర్బాజ్(15), నారయణ్ జగదీషన్(6) దారుణంగా విఫలమయ్యారు. ఈ పరిస్థితుల్లో వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా జట్టును ఆదుకున్నారు. ధాటిగా ఆడుతూ కేకేఆర్ స్కోర్ బోర్డు పరుగెత్తించారు. ఈ ఇద్దరి విధ్వంసానికి కేకేఆర్ 11 ఓవర్లలోనే 100 పరుగులు చేసింది.
క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని లిటిస్ జోసెఫ్ విడదీసాడు. నితీశ్ రాణాను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చి మూడో వికెట్కు నమోదైన 100 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. ఆ కొద్దిసేపటికే సెంచరీ దిశగా దూసుకెళ్తున్న వెంకటేశ్ అయ్యర్ను జోసెఫ్ క్యాచ్ ఔట్ చేశాడు. అప్పటికే కేకేఆర్ పటిష్టంగా ఉంది.

అయితే రషీద్ ఖాన్ హ్యాట్రిక్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు. వరుస బంతుల్లో రషీద్ ఖాన్(1), సునీల్ నరైన్(0), శార్దూల్ ఠాకూర్(0)లను ఔట్ చేయడంతో గుజరాత్ విజయం ఖాయమని అంతా భావించారు. చివరి ఓవర్లో కేకేఆర్ విజయానికి 29 పరుగుల అవసరం అవ్వగా.. ఉమేశ్ యాదవ్ సింగిల్ తీసి రింకూ సింగ్కు స్ట్రైక్ ఇచ్చాడు. రింకూ సింగ్ అనూహ్య రీతిలో వరుసగా ఐదు సిక్స్లు బాది విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.