అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్)తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ స్టార్ ఆల్రౌండర్ రషీద్ ఖాన్ హ్యాట్రిక్ వికెట్ సాధించాడు. వరుస బంతుల్లో డేంజరస్ ఆండ్రీ రస్సెల్(1), సునీల్ నరైన్(0), శార్దూల్ ఠాకూర్(0)లను పెవిలియన్ చేర్చాడు.
కేకేఆర్ ఇన్నింగ్స్ 17వ ఓవర్లో రషీద్ ఈ ఫీట్ సాధించి మ్యాచ్ను తమవైపు తిప్పుకున్నాడు. ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్లను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చిన రషీద్.. శార్దూల్ ఠాకూర్ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. దాంతో విజయం దిశగా సాగిన కేకేఆర్ ఇన్నింగ్స్ ఒక్కసారిగా కుదేలు అయ్యింది. అయితే రింకూ సింగ్ సంచలన బ్యాటింగ్తో అసాధారణ విజయాన్నందుకుంది.

ఈ సీజన్లో ఇదే తొలి హ్యాట్రిక్ వికెట్ కాగా.. గుజరాత్ టైటాన్స్ తరఫున కూడా మొదటిది. కేకేఆర్పై రషీద్ ఖాన్ కంటే ముందు మఖ్యా ఎన్తినీ(సీఎస్కే-2008), ప్రవీణ్ తాంబే(ఆర్ఆర్-2014), యుజ్వేంద్ర చాహల్(ఆర్ఆర్-2022)లు హ్యాట్రిక్ వికెట్ సాధించారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 204 పరుగులు చేసింది. విజయ్ శంకర్(24 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 63), సాయి సుదర్శన్(38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 53) హాఫ్ సెంచరీలతో రాణించారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ మూడు వికెట్లు తీయగా.. సుయాశ్ శర్మ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 207 పరుగులు చేసింది. రింకూ సింగ్తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్(40 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్లతో 83), నితీశ్ రాణా(29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 45) రాణించారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ మూడు వికెట్లు తీయగా.. అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ షమీ, జోష్ లిటిల్కు ఓ వికెట్ దక్కింది.
చివరి ఓవర్లో కేకేఆర్ విజయానికి 29 పరుగులు కావాల్సిన సమయంలో రింకూ సింగ్.. వరుసగా ఐదు సిక్స్లు బాది చారిత్రాత్మక విజయాన్నందించాడు.