అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్)తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఆల్రౌండర్ విజయ్ శంకర్(24 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 63) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. దాంతో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 204 పరుగులు చేసింది. శంకర్కు తోడుగా.. సాయి సుదర్శన్(38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 53) రాణించాడు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ మూడు వికెట్లు తీయగా.. సుయాశ్ శర్మ ఓ వికెట్ పడగొట్టాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్.. ఇన్నింగ్స్ను ధాటిగా ప్రారంభించింది. ఓపెనర్లు వృద్దిమాన్ సాహా(17), శుభ్మన్ గిల్ బౌండరీలతో విరుచుకుపడ్డారు. దాంతో సునీల్ నరైన్ను రంగంలోకి దింపిన కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా... ఆశించిన ఫలితాన్ని రాబట్టాడు. సాహాను నరైన్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చడంతో.. గుజరాత్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది.

క్రీజులోకి వచ్చిన సాయి సుదర్శన్తో శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. 67 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో సెట్ అయిన ఈ జోడీని నరైన్ విడదీసాడు. శుభ్మన్ గిల్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో క్రీజులోకి అభినవ్ మనోహర్(14) రాగా.. సుయాష్ శర్మ తన గూగ్లీతో క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన విజయ్ శంకర్తో సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఈ ఇద్దరూ క్విక్ సింగిల్స్, డబుల్స్తో పాటు వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. ఈ క్రమంలోనే సాయి సుదర్శన్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సాయి సుదర్శన్ను సునీల్ నరైన్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చగా.. క్రీజులోకి డేంజరస్ డేవిడ్ మిల్లర్ వచ్చాడు.
విజయ్ శంకర్ మాత్రం వరుస బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఫెర్గూసన్ వేసిన 19వ ఓవర్లో రెండు ఫోర్లు, రెండు సిక్స్లు బాది 25 పరుగులు పిండుకున్న అతను.. శార్దూల్ ఠాకూర్ వేసిన చివరి ఓవర్లో హ్యాట్రిక్ సిక్స్లతో 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శంకర్ విధ్వంసంతో గుజరాత్ 204 పరుగుల భారీ స్కోర్ చేసింది.