
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ ఆల్రౌండర్ ఆండ్రీ రస్సెల్(4/5) సంచలన బౌలింగ్తో చెలరేగాడు. గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో రస్సెల్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో 4 వికెట్లు పడగొట్టాడు. దాంతో గుజరాత్ ప్రత్యర్థి ముందు 157 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 156 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా(49 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 67) హాఫ్ సెంచరీతో చెలరేగగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో రస్సెల్ నాలుగు వికెట్లు తీయగా.. టీమ్ సౌథీ మూడు వికెట్లు పడగొట్టాడు. ఉమేశ్ యాదవ్, శివమ్ మావి తలో వికెట్ తీసారు.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్, ఇన్ ఫామ్ బ్యాట్స్మన్ శుభ్మన్ గిల్(7).. టీమ్ సౌథీ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా.. మరో ఓపెనర్ వృద్దిమాన్ సాహా(25)తో ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కొన్ని చూడ చక్కని షాట్లు ఆడటంతో గుజరాత్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 47 రన్స్ చేసింది. ఆ తర్వాత ధాటిగా ఆడిన ఈ జోడీ స్కోర్ బోర్డును పరుగెత్తించింది.
క్రీజులో కుదురుకున్న ఈ జోడీని ఉమేశ్ యాదవ్ విడదీసాడు. సాహాను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్కు నమోదైన 75 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి డేవిడ్ మిల్లర్ రాగా.. హార్దిక్ పాండ్యా 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మిల్లర్ సైతం రెండు భారీ సిక్సర్లతో చెలరేగడంతో స్కోర్ బోర్డు పరుగుత్తెంది. కానీ శివం మావి అతన్ని ఔట్ చేసి కోలు కోలేని దెబ్బతీసాడు.
ఆ మరుసటి ఓవర్లలోనే హార్దిక్ పాండ్యా సైతం ఔటవ్వడంతో గుజరాత్ పరుగుల వేగం తగ్గింది. రషీద్ ఖాన్ను టీమ్ సౌథీ ఔట్ చేయగా.. ఆండ్రీ రస్సెల్ తన ఆఖరి ఓవర్లో నాలుగు వికెట్లు తీసాడు. ఆ ఓవర్లో భారీ షాట్లకు అభినవ్ మనోహర్, లాకీ ఫెర్గూసన్, రాహుల్ తెవాటియా(17), యశ దయాల్(0) ఔటవ్వడంతో గుజరాత్ 156 పరుగులకే పరిమితమైంది.