
పుణే: ఐపీఎల్ 2022 సీజన్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్తో శనివారం జరిగిన రెండో మ్యాచ్లో సమష్టిగా చెలరేగిన హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్.. 14 పరుగులతో గెలుపొందింది. ఆ జట్టు స్టార్ పేసర్ ఫెర్గూసన్(4/28) నాలుగు వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 179 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్(46 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 84) హాఫ్ సెంచరీకి తోడుగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా(27 బంతుల్లో 4 ఫోర్లతో 31) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్, ఖలీల్ అహ్మద్ రెండేసి వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 157 పరుగులే చేసింది. కెప్టెన్ రిషభ్ పంత్(29 బంతుల్లో 7 ఫోర్లతో 43), లలిత్ యాదవ్(22 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 25) టాప్ స్కోరర్లుగా నిలిచారు. గుజరాత్ బౌలర్లలో ఫెర్గూసన్ నాలుగు వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ రెండు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.
172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్లు టీమ్ సీఫెర్ట్(3), పృథ్వీ షా(10) తీవ్రంగా నిరాశపరిచారు. హార్దిక్ పాండ్యా వేసిన రెండో ఓవర్లో సీఫెర్ట్ క్యాచ్ ఔట్గా వెనుదిరగ్గా.. ఫెర్గూసన్ బౌలింగ్లో పృథ్వీ షా క్యాచ్ ఔటయ్యాడు. ఆ తర్వాత మన్దీప్ సింగ్(18), కెప్టెన్ రిషభ్ పంత్ ఇన్నింగ్స్ నడిపించే ప్రయత్నం చేశారు. కానీ మన్దీప్ సింగ్ను ఫెర్గూసన్ కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చడంతో పవర్ ప్లేలో ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్లకు 43 పరుగులు చేసింది.
ఆ తర్వాత లలిత్ యాదవ్(25), పంత్ నిలకడగా ఆడగా.. ఈ జోడీని విజయ్ శంకర్ సూపర్ రనౌట్తో విడదీసాడు. అనవసర పరుగుకు ప్రయత్నించి లలిత్ యాదవ్ మూల్యం చెల్లించుకున్నాడు. ఆ కొద్దిసేపటికే హాఫ్ సెంచరీకి చేరువైన పంత్.. ఫెర్గూసన్ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత రోవ్మన్ పోవెల్(20) పోరాడినా.. అక్షర్ పటేల్(8), శార్దూల్ ఠాకూర్(2), ఖలీల్ అహ్మద్ విఫలమయ్యారు. రోవ్మన్ పొవెల్ కూడా ఔటవ్వడంతో మ్యాచ్ గుజరాత్ చేతిలోకి వెళ్లింది. ఇక కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ మరో వికెట్ పడకుండా ఓవర్లు పూర్తి చేయడంతో గుజరాత్ విజయం ఖాయమైంది.