అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్లో వరుస విజయాలతో జోరు మీదున్న టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్కు ఢిల్లీ క్యాపిటల్స్ దిమ్మతిరిగే షాకిచ్చింది. నరేంద్రమోదీ స్టేడియం వేదికగా మంగళవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ఢిల్లీ 5 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇషాంత్ శర్మ సూపర్ బౌలింగ్తో లోస్కోరింగ్ మ్యాచ్లో ఢిల్లీ సంచలన విజయాన్నందుకుంది. ఆఖరి ఓవర్లో 12 పరుగులును ఇషాంత్ శర్మ అద్భుతంగా డిఫెండ్ చేశాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 130 పరుగులు చేసింది. 23 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును ఆమన్ ఖాన్ (44 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 51) హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. అతనికి తోడుగా అక్షర్ పటేల్(27), రిపల్ పటేల్(23) రాణించారు. గుజరాత్ బౌలర్లలో షమీ నాలుగు వికెట్లు తీయగా.. మోహిత్ శర్మ రెండు, నూర్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 125 పరుగులే చేసింది. హార్దిక్ పాండ్యా(53 బంతుల్లో 7 ఫోర్లతో 59 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించినా.. రాహుల్ తెవాటియా(7 బంతుల్లో 3 సిక్సర్లతో 20) మెరుపులు మెరిపించినా ఫలితం లేకపోయింది.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఖలీల్ అహ్మద్ వేసిన తొలి ఓవర్ చివరి బంతికి వృద్దిమాన్ సాహా(0) డకౌటయ్యాడు. దాంతో ఈ ఓవర్ మెయిడిన్ అవ్వగా.. నాలుగో ఓవర్లో శుభ్మన్గిల్(6)ను అన్రిచ్ నోర్జ్ పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే విజయ్ శంకర్ను కూడా ఔట్ చేయడంతో పవర్ ప్లేలో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్లు కోల్పోయి 31 పరుగులు మాత్రమే చేసింది.
పవర్ ప్లే అనంతరం డేంజరస్ డేవిడ్ మిల్లర్(0)ను కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ పరిస్థిలుల్లో క్రీజులోకి వచ్చిన అభినవ్ మనోహర్తో కలిసి హార్దిక్ పాండ్యా జట్టును ఆదుకున్నాడు. ఈ ఇద్దరూ ఆచితూచి ఆడుతూ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. ఈ క్రమంలోనే హర్దిక్ పాండ్యా 44 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. అభినవ్ మనోహర్ను ఖలీల్ అహ్మద్ పెవిలియన్ చేర్చాడు. దాంతో 5వ వికెట్కు నమోదైన 62 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
చివరి 12 బంతుల్లో గుజరాత్ విజయానికి 33 పరుగులు అవసరమవ్వగా.. అన్రిచ్ నోర్జ్ వేసిన 19వ ఓవర్లో రాహుల్ తెవాటియ హ్యాట్రిక్ సిక్స్లు బాదడంతో గుజరాత్ విజయానికి ఆఖరి ఓవర్లో 12 పరుగులు అవసరమయ్యాయి. ఇషాంత్ శర్మ వేసిన చివరి ఓవర్లో తొలి మూడు బంతుల్లో మూడు పరుగులే వచ్చాయి. నాలుగో బంతికి రాహుల్ తేవాటియా(20) ఔటవ్వగా.. ఇషాంత్ తర్వాతి బంతులను కట్టడి చేసి ఢిల్లీ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.