అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ టాపార్డర్ మరోసారి చేతులెత్తేసింది. మహమ్మద్ షమీ(4/11) ధాటికి టాప్-5 బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. ఈ పరిస్థితుల్లో ఆమన్ ఖాన్(44 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 51) హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకోవడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 130 పరుగులు చేసింది.
ఆమన్ ఖాన్కు తోడుగా అక్షర్ పటేల్(27), రిపల్ పటేల్(23) రాణించారు. గుజరాత్ బౌలర్లలో షమీ నాలుగు వికెట్లు తీయగా.. మోహిత్ శర్మ రెండు, నూర్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. 23 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ కనీసం 50 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ ఆమన్ ఖాన్.. అక్షర్ పటేల్తో 50 పరుగులు.. రిపల్ పటేల్తో 53 పరుగులు జోడించి ఢిల్లీకి గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.

చెలరేగిన షమీ..: టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కు మహమ్మద్ షమీ దిమ్మతిరిగే షాకిచ్చాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే ఫిలిప్ సాల్ట్ను గోల్డెన్ డక్గా పెవిలియన్ చేర్చాడు. రెండో ఓవర్లో డేవిడ్ వార్నర్(2) రనౌటవ్వగా మూడో ఓవర్లో రిలీ రోసౌ(8)ను షమీ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఐదో ఓవర్లో మనీష్ పాండే(1), ప్రియామ్ గార్గ్(10)లను ఔట్ చేసి ఢిల్లీ క్యాపిటల్స్కు కోలుకోలేని దెబ్బతీసాడు.
ఆమన్ ఖాన్ హాఫ్ సెంచరీ..: షమీ ధాటికి ఢిల్లీ 23 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో అక్షర్ పటేల్(27), ఆమన్ ఖాన్ జట్టును ఆందుకున్నారు. ఆచితూచి ఆడుతూ 6వ వికెట్కు 50 పరుగులు జోడించారు. అక్షర్ పటేల్ను మోహిత్ శర్మ క్యాచ్ ఔట్ చేయగా.. రిపల్ పటేల్తో కలిసి ఆమన్ ఖాన్ జట్టును ముందుకు నడిపించాడు.
41 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నఆమన్ ఖాన్ను రషీద్ ఖాన్ ఔట్ చేయడంతో ఏడో వికెట్కు నమోదైన 53 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. చివరి ఓవర్ను మోహిత్ శర్మ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి.. రిపల్ పటేల్ను ఔట్ చేయడంతో ఢిల్లీ 130 పరుగులకే పరిమితమైంది.