చెన్నై: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న క్వాలిఫయర్-1 మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ అదిరిపోయే ఆరంభాన్ని అందుకుంది. రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. డేవాన్ కాన్వే ఆచితూచి ఆడుతున్నాడు. అయితే 2 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రుతురాజ్ గైక్వాడ్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
గుజరాత్ టైటాన్స్ యువ బౌలర్ దర్శన్ నల్లకండే చేసిన ఈ తప్పిదం చెన్నైకి కలిసొచ్చింది. అతను వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ మూడో బంతికి రుతురాజ్ గైక్వాడ్ క్యాచ్ ఔటయ్యాడు. అయితే ఈ బంతి నోబాల్ కావడంతో రుతురాజ్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ అవకాశంతో చెలరేగిన రుతురాజ్.. మరుసటి రెండు బంతులనే 6, 4గా మలిచాడు.

అనంతరం మరింత ధాటిగా ఆడిన అతను ఈ సీజన్లో నాలుగో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. గుజరాత్ టైటాన్స్పై ఉన్న తన మెరుగైన రికార్డును కొనసాగిస్తున్నాడు.
గత సీజన్లో గుజరాత్ టైటాన్స్ జరిగిన రెండు మ్యాచ్ల్లో 73(48), 53(49) రెండు హాఫ్ సెంచరీలు బాదిన రుతురాజ్.. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్లో 92(50) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. తాజా మ్యాచ్లోనూ 60(44) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఎట్టకేలకు రుతురాజ్ గైక్వాడ్ను మోహిత్ శర్మ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చడంతో తొలి వికెట్కు నమోదైన 88 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే(1)ను నూర్ అహ్మద్ క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి అజింక్యా రహానే రాగా.. కాన్వే ఇన్నింగ్స్ను ముందుకు నడిపిస్తున్నాడు.
నోబాల్ వేసిన దర్శన్ నల్లకండేపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కీలక మ్యాచ్లో తప్పిదం చేయడం ఏంటని మండిపడుతున్నారు. ఈ తప్పిదం టీమ్ ఫలితాన్ని శాసించేలా ఉందని, ఈ అవకాశంతో చెలరేగిన రుతురాజ్ హాఫ్ సెంచరీ బాది జట్టుకు మంచి శుభారంభాన్ని అందించారని కామెంట్ చేస్తున్నారు.
నోబాల్ కాకుంటే రుతురాజ్ 2 పరుగులకే వెనుదిరిగే వాడని, అప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ మరిన్ని కష్టాల్లో పడేదని అభిప్రాయపడుతున్నారు.