చెన్నై: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న క్వాలిఫయర్-1 మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(44 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 60) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 172 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే(34 బంతుల్లో 4 ఫోర్లతో 40), రవీంద్ర జడేజా(16 బంతుల్లో 2 ఫోర్లతో 22) పర్వాలేదనిపించారు.
గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ రెండేసి వికెట్లు తీయగా.. దర్శన్ నల్కండే, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మోమిత్ శర్మ తలో వికెట్ తీసారు. పిచ్ కాస్త స్లోగా ఉన్న నేపథ్యంలో ఈ లక్ష్యం కాపాడుకోవడం చెన్నైకి పెద్ద కష్టమేమి కాదు.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్కు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే శుభారంభాన్ని అందించారు. 2 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద లభించిన లైఫ్ను అందిపుచ్చుకున్న రుతురాజ్ గైక్వాడ్ సూపర్ బ్యాటింగ్తో చెలరేగాడు. డేవాన్ కాన్వే నిదానంగా ఆడినా.. రుతురాజ్ ధాటిగా ఆడాడు. దాంతో పవర్ ప్లేలో చెన్నై వికెట్ నష్టపోకుండా 49 పరుగులు చేసింది.
పవర్ ప్లే అనంతరం మరింత జోరు కనబర్చిన రుతురాజ్.. 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని మోహిత్ శర్మ విడదీసాడు. రుతురాజ్ గైక్వాడ్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే(1)ను నూర్ అహ్మద్ క్లీన్ బౌల్డ్ చేయగా.. అజింక్యా రహానే(17)ను దర్శన్ నల్లకండే పెవిలియన్ చేర్చాడు. హాఫ్ సెంచరీకి చేరువైన డేవన్ కాన్వేను మహమ్మద్ షమీ ఔట్ చేయగా.. అంబటి రాయుడు(17)ని రషీద్ ఖాన్ ఔట్ చేశాడు. క్రీజులోకి వచ్చిన జడేజా(22) ధాటిగా ఆడే క్రమంలో ఔటవ్వగా.. ధోనీ(1) తీవ్రంగా నిరాశపరిచాడు. మోయిన్ అలీ సిక్సర్తో జట్టు స్కోర్ను 170 పరుగులు ధాటించాడు.